MM Keeravani Father Passed Away: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా (92) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్కు సోదరుడైన శివశక్తి పలు తెలుగు సినిమాలకు పాటలు రాశారు. లిరిక్ రైటర్, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా మంచి గుర్తింపు పొందారు.
1932 అక్టోబర్ 8న రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో శివశక్తి జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. అప్పట్లోనే ఇంటర్ చదువుకున్న ఈయన చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబయిలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ చేరారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కొవ్వూరు తిరిగొచ్చి చిత్రకారుడిగా పని చేశారు. 'కమలేశ్' అనే కలం పేరుతో ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మ్యూజిక్పై ఇష్టంతో సితార, గిటార్, హార్మోనియం నేర్చుకున్నారు.
విజయేంద్ర ప్రసాద్తో ఇండస్ట్రీలోకి...
సంగీతంపై పట్టు సంపాదించిన తర్వాత మద్రాస్ వెళ్లిపోయి సోదరుడు విజయేంద్ర ప్రసాద్తో కలిసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1988లో వచ్చిన 'జానకి రాముడు' సినిమాకు స్క్రీన్ రైటర్గా పని చేశారు శివ దత్తా. ఈ మూవీతో ఇద్దరికీ మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలకు పాటలు రాస్తూ వచ్చారు. బాహుబలి 1లో (మమతల తల్లి, ధీవర), బాహుబలి 2 (సాహోరే బాహుబలి), 'ఎన్టీఆర్: కథానాయకుడు' (కథానాయక), 'సై' సినిమాలో (నల్లా నల్లాని కళ్ల పిల్ల), హనుమాన్ (అంజనాద్రి థీమ్ సాంగ్), రాజన్న (అమ్మా అవని), ఛత్రపతి (మన్నేల తింటివిరా) పాటలు రాశారు.
శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, శివశ్రీ కాంచి, కల్యాణి మాలిక్. ఆయనకు ఒక అన్న, ఓ అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. తమ్ముడు విజయేంద్ర ప్రసాద్. శివశక్తి దత్తా మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read: 'పెళ్లి సంబంధం మాట్లాడతా... ప్లీజ్ నెంబర్ ఇవ్వొచ్చుగా?' - హీరోయిన్ నిధి అగర్వాల్ క్యూట్ రిప్లై