Mirnaa Menon about Jailer Sequel: ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. దానికి సీక్వెల్ రావడం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వెల్ గురించి అనౌన్స్ చేయగా.. మరికొన్ని మాత్రం సీక్వెల్‌కు సన్నాహాలు చేసే స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇక రజినీకాంత్ హీరోగా నటించి బ్లాక్‌బస్టర్ సాధించిన ‘జైలర్’కు కూడా సీక్వెల్ ఉంటుందని ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఈ సీక్వెల్‌పై స్పందించడానికి ఇష్టపడలేదు. తాజాగా ‘జైలర్’లో రజినీకాంత్ కోడలిగా నటించిన మిర్నా మీనన్.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.


కమ్ బ్యాక్ చిత్రం..


నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం సూపర్ స్టార్‌కు కమ్ బ్యాక్ ఇచ్చింది. ‘జైలర్’కు పోటీగా ఎన్నో చిత్రాలు విడుదలయినా కూడా వాటన్నింటికంటే ఈ సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ దక్కాయి. పైగా ఇందులో మరోసారి వింటేజ్ రజినీని చూశామని ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ‘జైలర్’ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘బర్త్ మార్క్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ‘జైలర్ 2’పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది మిర్నా మీనన్.


దర్శకుడి చేతిలో ఉంటుంది..


‘‘నేను నెల్సన్ సార్‌తో ఈమధ్యే మాట్లాడాను. ‘జైలర్ 2’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చెప్పారు. నేను ‘జైలర్ 2’లో భాగమవుతానా లేదా అనేది ఇంకా తెలియదు. అది దర్శకుడి చేతిలోనే ఉంటుంది. తను నా పాత్రను పొడగించాలనుకుంటే సీక్వెల్‌లో కూడా నేను ఉంటాను’’ అని క్లారిటీ ఇచ్చింది మిర్నా మీనన్. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ‘జైలర్ 2’కు కూడా అనిరుదే సంగీతాన్ని అందిస్తే.. అది కూడా ‘జైలర్’లా సూపర్ హిట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘జైలర్’ సినిమా సక్సెస్‌లో ఎక్కువగా క్రెడిట్ అనిరుద్‌కే వెళ్తుంది. తను అందించిన సంగీతం, పాటలు ఇవన్నీ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. అంతే కాకుండా మూవీలో డల్‌గా ఉన్న సీన్స్‌కు కూడా సూపర్ బీజీఎమ్‌ను అందించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు.


ఆ రెండు సినిమాల తర్వాతే..


‘జైలర్’ కోసం ఎన్నో ఏళ్ల తర్వాత రజినీకాంత్, రమ్యకృష్ణ కలిసి నటించారు. ఇక ‘జైలర్ 2’ షూటింగ్ ప్రారంభించాలంటే ముందుగా రజినీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తవ్వాలి. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ ‘వెట్టాయన్’ అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ‘వెట్టాయన్’ పూర్తయిన తర్వాత లోకేశ్ కనకరాజ్‌తో ఒక మూవీని ప్లాన్ చేశారు రజినీకాంత్. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే ఆయన ‘జైలర్ 2’ సెట్స్‌లో అడుగుపెట్టగలరు. ‘జైలర్’ను భారీ బడ్జెట్‌తో నిర్మించిన సన్ పిక్చర్స్‌కే.. సీక్వెల్ నిర్మాణ బాధ్యతలు కూడా దక్కనున్నాయని సమాచారం.


Also Read: చెన్నైలో ఉండి బ‌తికిపోయాడు - సంగీత దర్శకుడిపై 'సిద్ధార్థ్ రాయ్' డైరెక్టర్ ఫైర్