ఏం జరుగుతోంది? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో మొదలైన రగడ ఇంకా చల్లారలేదా? మంచు, మెగా కుటుంబాల మధ్య వైరం అలాగే ఉందా? ఇంకా కొనసాగుతోందా? అంటే... 'అవును' అనే చెప్పాల్సి వస్తోంది. తాజా పరిణామాలు చూస్తే... ఒకరి మీద మరొకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు.


'మా' ఎన్నికలకు ముందు, ఆ తర్వాత చాలా మంచు - మెగా కుటుంబాల మధ్య ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత హెయిర్ డ్రస్సర్, మంచు ఫ్యామిలీ ఇష్యూలో నాగబాబు ఎంటర్ అయ్యారు. నాగ శీనుకు సాయం చేశారు. అవన్నీ పక్కన పెడితే... ఇప్పుడు మరోసారి ఎన్నికల ప్రస్తావన వచ్చింది. శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవంలో, మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్ మాట్లాడుతూ "ఒక వ్యక్తి ప్రతిసారీ మా అన్నయ్యను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూశాడు. మేం అతని మాటల్ని పట్టించుకోలేదు. 'మా' ఫలితాలు వచ్చిన తర్వాత మాకు మద్దతుగా నిలిచిన వాళ్ళను వయసుతో సంబంధం లేకుండా మాటలు అన్నారు. అతను ఎందుకలా మాట్లాడుతున్నాడా? అని ఆలోచించాను. మా నాన్నగారిని అడిగా. ఆయన ఒక్కటే చెప్పారు... ఆ వ్యక్తికి జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యం (హయ్యర్ పర్పస్) లేదని! నిజమే అనిపించింది. అన్నయ్యను టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ గొప్పవాళ్లు ఉన్నారు. ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో జీవిస్తున్నారు. కానీ, ఆయన మాత్రం ఎటువంటి లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు" అని అన్నారు.


నాగబాబును ఉద్దేశించి మనోజ్ ఆ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో పలువురు భావిస్తున్నారు. ఇటు నాగబాబు సైతం సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో 'ఇక మొదలెడదామా!' అంటూ ఛాట్ చేశారు. ఉన్నట్టుండి ఈ ప్రోగ్రామ్ ఏంటని ఒకరు ప్రశ్నిస్తే... 'హయ్యర్ పర్పస్' కోసం అంటూ బదులు ఇచ్చారు. అది మనోజ్ మంచును ఉద్దేశించే అనేది సోషల్ మీడియా టాక్. 'మంచు మనోజ్ మీద స్పీచ్ మీద మీ కామెంట్' అని అడిగితే... 'నో కామెంట్స్ బ్రో' అని నాగబాబు రిప్లై ఇచ్చారు. 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా గురించి ఒక్క మాట అని అడిగితే 'చెప్పను బ్రదర్' అని అల్లు అర్జున్ డైలాగ్ చెప్పిన వీడియో పోస్ట్ చేశారు. చూస్తుంటే... మరికొన్ని రోజులు ఈ కోల్డ్ వార్ నడిచేలా ఉంది. 


Also Read: థియేట‌ర్ల‌లో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఎదురులేదు. మ‌రి, ఓటీటీల్లో? - ఈ వారం విడుదలవుతున్న చిత్రాలు ఇవే