సినీ సెలబ్రిటీలు అనేవారు ఫ్యాషన్‌కు రోల్ మోడల్స్‌లాగా ఉంటారు. వారు సింపుల్‌గా కనిపించినా కూడా అందులో ఎంతోకొంత ఫ్యాషన్ సెన్స్ ఉంటుంది. సెలబ్రిటీలులాగా మేము కూడా డ్రెస్సింగ్ చేసుకోవాలి అని చాలామంది కలలు కంటుంటారు. అలాంటి మంచి ఫ్యాషన్ సెన్స్, డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న నటీనటుల్లో మహేశ్ బాబు పేరు కూడా ఉంటుంది. ఎలాంటి ఈవెంట్ అయినా, తన చుట్టూ ఉన్నవారు ఎంత గ్రాండ్‌గా ఉన్నా మహేశ్ మాత్రం సింపుల్‌గానే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. తాజాగా బిగ్ సీ 20వ యానివర్సరీ వేడుకల్లో పాల్గొన్న మహేశ్ షర్ట్.. చాలామంది ఫ్యాన్స్‌కు నచ్చింది. అసలు దీని ధర ఎంత ఉంటుంది అని అప్పుడే వారు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.


ధర ఎంతంటే..?
మహేశ్ బాబు ఎప్పుడూ సినిమాలతో మాత్రమే కాదు.. బ్రాండ్స్ యాడ్స్ వల్ల కూడా చాలా బిజీగా గడిపేస్తుంటారు. ప్రస్తుతం సౌత్‌లోని అందరి హీరోలకంటే మహేశ్ చేతిలోనే ఎక్కువగా బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ ఉన్నాయి. ఓవైపు సినిమాలతో, మరోవైపు బ్రాండ్స్‌తో మహేశ్ రెండు చేతులా సంపాదిస్తుంటారు. ఎంత సంపాదించినా.. సింపుల్‌గా ఉండడం మహేశ్ పాలిసీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బిగ్ సీ 20వ యానివర్సరీ ఈవెంట్ కోసం ఒక డార్క్ కలర్ చెక్ షర్ట్ వేసుకున్నారు మహేశ్. అయితే ఆ షర్ట్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్నా.. దాని ధర మాత్రం రూ.18 వేలని సమాచారం. ఈ షర్ట్ డీజిల్ బ్రాండ్‌కు చెందిందని, అందుకే అన్ని వేలు ధర ఉందని తెలుస్తోంది.


‘బ్రో’ నుండి మొదలయిన కాంట్రవర్సీ..
ప్రస్తుతం మహేశ్ బాబు.. ‘గుంటూరు కారం’ సినిమాలో బిజీగా ఉన్నారు. ఇంకా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ‘గుంటూరు కారం’ చుట్టూ అనేక కాంట్రవర్సీలు తిరుగుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై త్రివిక్రమ్ కాంట్రవర్సీల ప్రభావం కూడా పడుతోంది. ‘బ్రో’ మూవీ వల్ల త్రివిక్రమ్ రాజకీయపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ రాజకీయ కాంట్రవర్సీ ప్రభావం ‘గుంటూరు కారం’ మీద కూడా పడుతుందని ఫ్యాన్స్ ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. దాంతో పాటు సినిమా తెరకెక్కుతున్న క్రమంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వస్తున్న వార్తలు మహేశ్ ఫ్యాన్స్‌ను అయెమయ స్థితిలో పడేస్తోంది. కానీ ఈ ఆందోళనలను, అయోమయాన్ని త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు ఒక మాస్ పోస్టర్ విడుదల చేసి దూరం చేస్తూనే ఉన్నాడు.


ముందు హీరోయిన్.. ఆపై మ్యూజిక్ డైరెక్టర్..
ముందుగా ‘గుంటూరు కారం’ నుండి హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ స్థానంలో ఉన్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ స్థానాన్ని తీసుకుంది. సెకండ్ హీరోయిన్‌గా ‘హిట్ 2’ ఫేమ్ మీనాక్షి చౌదరీ రంగంలోకి దిగింది. పైగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో తమన్‌పై వస్తున్న నెగిటివిటీకి కూడా తను ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూనే ఉన్నా.. అసలు తమన్ కూడా ‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్‌లో చివరి వరకు ఉంటాడా లేదా అన్న అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పటికే విడుదలయిన ‘గుంటూరు కారం’ గ్లింప్స్‌లో తమన్ అందించిన సంగీతం మాత్రం ఫ్యాన్స్‌ను తృప్తిపరిచింది. ఎప్పటిలాగానే తమన్ కాపీ క్యాట్ అంటూ కామెంట్స్ వినిపించినా.. మహేశ్ మాస్ లుక్‌కు తమన్ సంగీతం పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందని ఫ్యాన్స్ సంతోషించారు.


Also Read: ఓ మహిళ నన్ను అక్కడ అసభ్యకరంగా తాకింది, నొప్పితో బాధపడ్డా: దుల్కర్ సల్మాన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial