Mahesh Babu's Khaleja Re Release Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెల 30న రీ రిలీజ్ కానుండగా.. తాజాగా ట్రైలర్‌ను టీం విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

మహేష్ కెరీర్‌లోనే డిజాస్టర్

'అతడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే.. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలగలిపి తెరకెక్కించిన ఈ మూవీ మహేష్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది. టైటిల్ వివాదాలతో 'మహేష్ ఖలేజా' పేరుతో 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతకు నష్టాలు మిగిల్చింది. కానీ.. తర్వాత రోజుల్లో ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.

మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని కామెడీ యాంగిల్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో అంతే క్రేజ్ ఉంటుందనే దృష్టిలో ఉంచుకుని ఈ మూవీని రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. 4K వెర్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా మూవీని ఈ నెల 30న రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Also Read: 'నాయకుడు' కంటే 'థగ్ లైఫ్' భారీ హిట్ అవుతుంది... ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు కమల్ హాసన్ ప్రామిస్

ట్రెండ్ కొనసాగేనా?

ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ఒకప్పటి హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్‌గా నిలిచిన మూవీస్ సైతం ఇప్పుడు మళ్లీ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు 'పోకిరి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. 'ఖలేజా' సినిమా సైతం అంతే స్థాయిలో హిట్ అవుతుందని టీం భావిస్తోంది. ఈ మూవీ అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచినా ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అదే కల్ట్ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు.

'ఖలేజా' మూవీలో మహేష్ బాబు సరసన స్వీటీ అనుష్క హీరోయిన్‌గా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ రోల్‌లో నటించి మెప్పించారు. రావు రమేష్, షఫీ, సునీల్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సుబ్బరాజు, అర్చన కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ రీ రిలీజ్‌లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

స్టోరీ ఏంటంటే?

సీతారామరాజు (మహేష్ బాబు) ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్. అప్పుడప్పుడూ అనుకోకుండా జరిగే ప్రమాదాలతో సుభాషిణి (అనుష్క) అతనికి పరిచయం అవుతుంది. అనుకోని రీతిలో రాజు రాజస్థాన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఓ గ్యాంగ్ ఇతనిపై దాడి చేస్తుంది. ఇదే సమయంలో ఏపీలోని పాలి గ్రామంలో ఊహించని మరణాలు సంభవిస్తుంటాయి. తమ ఊరిని కాపాడేందుకు దేవుడు రావాలని ఆ గ్రామస్థులు భావిస్తుంటారు. అలా ఓ వ్యక్తి దేవున్ని వెతుక్కుంటూ వెళ్లగా.. గాయాలతో ఉన్న రాజు కనిపిస్తాడు. తన ఊరిని కాపాడాలంటూ అతన్ని వేడుకుంటాడు.

గ్రామస్థులంతా రాజును దేవుడిలా భావిస్తారు. అసలు ఆ ఊరికి వచ్చిన కష్టం ఏంటి?, రాజుపై ఆ గ్యాంగ్ ఎందుకు దాడికి దిగారు?, సుభాషిణికి ఆ గ్రామానికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.