Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న'అన్ స్టాపబుల్ షో' కి సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి గెస్ట్ గా రాబోతున్నట్లు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతోంది. మహేష్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ షోలో సందడి చేయబోతున్నట్లు చెబుతున్నారు. డీటెయిల్స్ కి వెళ్తే.. బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం మూడవ సీజన్ కొనసాగిస్తోంది. అయితే ఈ మూడో సీజన్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే సీజన్ 3లో ‘భగవంత్ కేసరి’ మూవీ టీం, ‘యానిమల్’ మూవీ టీం సందడి చేసిన విషయం తెలిసిందే.


ఇక త్వరలోనే 'గుంటూరు కారం' మూవీ టీం నుంచి మహేష్ బాబు, త్రివిక్రమ్ 'అన్ స్టాపబుల్ సీజన్ 3'కి గెస్ట్లుగా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ షో కి గెస్ట్ గా రావడం ఇది రెండోసారి. సీజన్ వన్ ఫైనల్ ఎపిసోడ్‌కు మహేష్ గెస్ట్ గా వచ్చాడు. ఆ సమయంలో త్రివిక్రమ్‌ను కూడా ఈ షోకి తీసుకొస్తానని బాలయ్యకు మహేష్ మాట కూడా ఇచ్చారు. అలా బాలయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈసారి త్రివిక్రమ్‌తో కలిసి అన్ స్టాపబుల్ షోకి మహేష్ అటెండ్ అవ్వబోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు మహేష్, త్రివిక్రమ్ అన్‌‌స్టాప్‌బుల్ ఎపిసోడ్ ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.


అందుకే మహేష్ రెండవసారి ఈ షోకు వెళ్లేందుకు అంగీకరించాడని అంటున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఉండబోతుందట. జనవరి మొదటి వారంలో ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే గుంటూరు కారం మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సాంగ్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సెకండ్ సింగిల్ 'ఓ మై బేబీ' ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఫుల్ లిరికల్ వీడియోని డిసెంబర్ 13 సాయంత్రం విడుదల చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ఈ సాంగ్ పై అంచనాలను మరింత పెంచేసింది. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ని ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్ పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా.. PS వినోద్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Also Read : 'బింబిసార 2'పై కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్ - షూటింగ్ అప్పుడేనట!