Trolls on Mahesh Babu & SS Rajamouli : ఒక్కోసారి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, డైరెక్టర్ అయినా సరే వారు నటించిన లేదా డైరెక్ట్ చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతే ఈ రోజుల్లో సోషల్ మీడియా పోస్ట్‌లతో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. భారీ స్థాయిలో ట్రోల్ చేస్తూ విమర్శించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి విషయంలోనూ అదే జరుగుతోంది. 'మేమ్ ఫేమస్' అనే చిన్న సినిమాకు చేసిన పబ్లిసిటీపై ఇప్పుడు వీరిద్దరినీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.


'మేమ్ ఫేమస్' సినిమా రిలీజ్ కాకముందే మహేష్ బాబు ఆ సినిమాకు పాజిటివ్ రివ్యూ పెట్టగా, రిలీజ్ తర్వాత రాజమౌళి కూడా పాజిటివ్ రివ్యూని పోస్ట్ చేశారు. అవి ఆబ్లిగేషన్ ట్వీట్స్ అని స్పష్టంగా కనిపించినప్పటికీ, మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరూ ఈ సినిమాని ఓ గేమ్ ఛేంజర్ లాగా ప్రశంసించారు. ఇది నెటిజన్లలో బాగా దూసుకువెళ్లింది. ఎందుకంటే చాలామంది 'మేమ్ ఫేమస్' నిరాశ పరిచిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. అలాంటి ఈ సినిమాపై ఓ పేరున్న నటుడు, దర్శకుడు ఇలాంటి రివ్యూ ఇవ్వడంపై వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో నెటిజన్లు మహేశ్ బాబు, రాజమౌళిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. 


'మేమ్ ఫేమస్' మూవీ ఇటీవలే ఓటీటీ( OTT)లో రిలీజైంది. ఇది నెటిజన్లు మహేష్ బాబు, రాజమౌళిని ట్రోల్ చేయడానికి కారణం అయింది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూని ఎలా పోస్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదని పలువురు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందిన 'బలగం' లాంటి సినిమా గురించి ఎలాంటి స్పందన వ్యక్తం చేయని వారు.. ఈ మూవీకి ఎలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారంటూ తిట్టిపోస్తున్నారు. యూట్యూబ్‌లో పెట్టాల్సిన మూవీని థియేటర్లో రిలీజ్ చేసి ఎక్కడా లేని హైప్ ఇచ్చారని విమర్శిస్తున్నారు. అయితే, మహేష్ బాబు.. రాజమౌళి యువ నటీనటులు, దర్శకులను ప్రోత్సహించడం కోసమే అలా చేసి ఉంటారని వారి అభిమానులు అంటున్నారు. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవల్సిన అవసరం లేదని, సినిమా నచ్చడం.. నచ్చకపోవడం అనేది వారివారి అభిరుచికి సంబంధించిందని వాదిస్తున్నారు.


షార్ట్ ఫిలింస్ తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'మేమ్ ఫేమస్' చిత్రం ఊర్లో బలాదూర్ గా తిరిగే ముగ్గురు యువకులు ఎలా ఫేమస్ అయ్యారో తెలిపుతుంది. కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 26న థియేటర్లలో రిలీజై.. నెల రోజుల తర్వాత జూన్ 30నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 


ఇక మహేష్ బాబు, రాజమౌళి సినిమా విషయానికొస్తే వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సారి సినిమా రాబోతుంది.  మహేశ్ బాబు 29వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ 'గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్' అని, దాన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తామని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి, మహేష్ బాబు పాత్ర గురించి డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే అనేక సూచనలు ఇవ్వడంతో సినీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది.


Read Also : 'ఉస్తాద్ భగత్ సింగ్' పై క్రేజీ అప్డేట్.. త్వరలోనే షూటింగ్ రీ షెడ్యూల్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial