‘మహర్షి’ సినిమాలో రైతు పాత్రతో అందరికీ గుర్తుండిపోయేలా నడించిన గురుస్వామి శుక్రవారం సాయంత్రం కర్నూలులో మరణించారు. కొద్దికాలంగా ఆయన  అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'మహర్షి' సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నటించిన గురుస్వామి తన నటనతో అందరినీ మెప్పించారు.


మహర్షి తర్వాత కూడా పలు సినిమాల్లో ఆయన నటించారు. గురుస్వామి సొంతూరు కర్నూలు జిల్లా వెల్దుర్తి. ఆయన గతంలో స్టేజ్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభను ప్రదర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఒకవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరోవైపు నాటక రంగంలో రాణించారు. విజేత ఆర్ట్స్ స్థాపించి కొన్ని నాటకాలు కూడా వేశారు. గురుస్వామి మృతిపై కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆయన ఆత్మ శాంతించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.