Mahesh Babu's Varanasi Leaks From The Sets : సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతోన్న విజువల్ వండర్ వారణాసి. హాలీవుడ్ రేంజ్లో ఫస్ట్ గ్లింప్స్తోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ భారీ ప్రాజెక్టును లీకుల బెడద వెంటాడుతోంది. తాజాగా సెట్స్ నుంచి మరో వీడియో లీకైంది.
కీలక సీన్?
మహేశ్ బాబుకు సంబంధించి ఓ కీలక సీన్ లీకైనట్లు తెలుస్తోంది. ఆ ఫుటేజీ క్షణాల్లోనే పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్లో వ్యాపించింది. ఇదే కీలక సీన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో మహేశ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు ఫ్యాన్స్ పేజీల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. గతంలోనూ వారణాసి సెట్ నుంచి పలు వీడియోలు లీక్ అయ్యాయి. అయితే, వీటిని షేర్ చెయ్యొద్దని, ఇవి షేర్ చేస్తే ఆ అకౌంట్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా రాజమౌళి మూవీ షూటింగ్ అంటేనే రెండంచెల భద్రత ఉంటుంది. హీరో నుంచి టెక్నీషియన్స్ వరకూ సెట్స్లోకి వెళ్లే ముందు కూడా ఫోన్స్ సబ్మిట్ చెయ్యాలి. పూర్తి భద్రతతో షూటింగ్ జరుగుతుంది. అయితే, గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ముందు ఓ వీడియో కూడా లీక్ అయ్యింది. ఇప్పుడు మరో ఫుటేజీ లీక్ కావడంతో వీటిపై దృష్టిం సారించాలని ఫ్యాన్స్, మూవీ లవర్స్ కోరుతున్నారు. మరి రాజమౌళి అండ్ టీం, నిర్మాతలు ఈ లీకులపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది.
Also Read : GDN Release : మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్
వారణాసి కథ ఏంటి?
అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వారణాసి కథ గురించి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు రాజమౌళి. ఈ మూవీ తండ్రీ కొడుకుల ఎమోషన్తో నడుస్తుందని చెప్పారు. ఆధ్యాత్మిక నగరంలో ప్రారంభమైన స్టోరీ... అంటార్కిటికా, ఆఫ్రికా అడవుల్లో ప్రయాణించి రామాయణ కాలానికి తీసుకెళ్లి మళ్లీ వారణాసికి తిరిగొస్తుందని అన్నారు. 2022లో డెవలప్ చేసిన స్టోరీని కంప్లీట్ చేయడానికి దాదాపు నాలుగున్నరేళ్లు పట్టిందని చెప్పారు. 300 అడుగులకు పైగా ఉన్న భారీ మంచు కొండ, రామాయణంలోని భారీ వానర సేన ఇలా ఎన్నో కీలక సీన్స్ ఇందులో ఉన్నట్లు తెలిపారు. వీటిని ఐమ్యాక్స్ ఫార్మాట్లో షూట్ చేసినట్లు వెల్లడించారు.
మహేశ్ బర్త్ డేకు
గ్లింప్స్ తర్వాత రీసెంట్గా ప్రియాంక చోప్రా మోడ్రన్ లుక్ రివీల్ చేశారు రాజమౌళి. ఆగస్ట్ 9న మహేశ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. అయితే, స్పెషల్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసే అవకాశం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని... ఇంకా చిన్న చిన్న సీన్స్ పెండింగ్ ఉంది. అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి గ్రాఫిక్ వర్క్స్పై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో రుద్రుడు, శ్రీరాముడిగా మహేశ్ బాబు, మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Makutam Trailer: శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
