Kareena Kapoor: సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్‌లో హీరోయిన్లకు రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వారు ఫార్మ్‌లో ఉన్నా లేకపోయినా.. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా పారితోషికం విషయంలో డిమాండ్‌ను ఏ మాత్రం తగ్గించరు బాలీవుడ్ భామలు. అలాంటి వారిలో కరీనా కపూర్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌తో పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది కరీనా. దాదాపు 2 దశాబ్దాలుగా హీరోయిన్‌గా చలామణీ అవుతున్న తను తాజాగా ఇతర హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి, తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


డబ్బుకు సంబంధం లేదు..


ఇప్పటికీ కరీనా కపూర్.. ఒక్క సినిమా కోసం రూ.10 కోట్ల నుండి 15 కోట్ల పారితోషికం తీసుకుంటుందని బాలీవుడ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దానిపై తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కరీనా స్పందించింది. ‘‘అంత రెమ్యునరేషన్ వస్తే బాగానే ఉంటుంది. నాకు కూడా అంతే తీసుకోవాలని ఉంది. నా యాక్టింగ్ గురించి కాదు కానీ నేను ఎంచుకునే సినిమాలు అలా ఉంటాయి. నేను వాటిని డబ్బు కోసం సెలక్ట్ చేసుకోను. ఒకవేళ ఒక సినిమాలో నా పాత్ర నచ్చితే తక్కువ రెమ్యునరేషన్‌ అయినా ఒప్పుకుంటానేమో. అది నా మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. నా దగ్గరకు వచ్చే సినిమాలపై ఆధారపడి ఉంటుంది. ఆ రోల్ ఎలాంటిది అనేదానిపై ఆధారపడి ఉంటుంది’’ అని తెలిపింది కరీనా కపూర్.


ఇంకా కష్టపడుతున్నాను..


‘‘నేను ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసేయగలను అని స్టేజ్‌లో ఉన్నానని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఒక పెద్ద కమర్షియల్ సినిమాలో నేను చేస్తున్నానంటే మీరు చెప్పిన రెమ్యునరేషన్ కూడా తక్కువే. దానికంటే ఎక్కువే ఛార్జ్ చేస్తానేమో. ఇది మా ఆయన ఇల్లు. మనం మా ఆయన ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే నేను ఇంకా కష్టపడుతున్నాను’’ అంటూ నవ్వుతూ తన స్టైల్‌లో సమాధానమిచ్చింది కరీనా కపూర్. ప్రస్తుతం ఈ భామ రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సింగం అగైన్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కోసం మరోసారి అజయ్ దేవగన్‌తో జతకట్టనుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో అజయ్‌తో కలిసి నటించడంపై స్పందించింది కరీనా.


ఎప్పటినుండో ఫ్రెండ్స్..


‘‘నాకు పదేపదే అజయ్ దేవగన్‌తో నటించే అవకాశం దక్కినందుకు చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను. నేను నటి అవ్వకముందు నుండి కూడా నాకు అజయ్ తెలుసు. తను మంచి యాక్టర్, మంచి మనిషి. నటీనటుల్లో నాకు అసలైన ఫ్రెండ్ అని చెప్పుకునే మనిషి తను ఒక్కడే. మేము కలిసి సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. 25, 30 ఏళ్ల నుండి మేము ఫ్రెండ్స్‌గా ఉన్నాం. తనకు కూడా సినిమా గురించి చాలా తెలుసు. కథ అనేది ఎంత ముఖ్యమో తెలుసు. తనకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది’’ అంటూ అజయ్‌పై ప్రశంసలు కురిపించింది. చివరిగా ‘క్రూ’ సినిమాలో టబు, కృతి సనన్‌తో కలిసి నటించి తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది కరీనా కపూర్.



Also Read: బయట నుంచి చూసేవారికి అది అర్థం కాకపోవచ్చు - ‘కల్కి 2898 ఏడీ’లోని ఆ సీన్‌పై అమితాబ్ వివరణ