Kalyani Malik: ‘అమృతం’ సీరియల్ పేరు వినగానే.. మనకు వెంటనే మనసులో తట్టేది.. ‘‘ఒరేయ్ ఆంజనేలు.. తెగ ఆయాసపడిపోకు చాలు’’ అనే పాట గుర్తుకొస్తుంది కదూ. మరి, ఆ పాటను స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరో తెలుసా? ఆయనే కళ్యాణి మాలిక్. కేవలం ఆ సీరియల్‌కు మాత్రమే కాదు.. ‘ఐతే’, ‘అష్టచమ్మ’, ‘అలా మొదలైంది’, ‘ఊహలు గుసగుసలాడే’.. ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇటీవల ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ సినిమాతో ఆయన కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘విద్యా వాసుల అహం’ మూవీకి సంగీతం అందించారు. ఆయన ఎన్నో సినిమాలకు మంచి సంగీతం ఇచ్చినా.. ఎందుకో అవకాశాలు మాత్రం క్యూ కట్టడం లేదు. తాజా ఇంటర్యూలో ఆయన ఇందుకు గల కారణాలను వివరించారు. 


టాలీవుడ్‌లో చాలామంది అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ వారిలో కొందరికి మాత్రమే ఫేమ్ లభించింది. అలాంటి అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో కల్యాణి మాలిక్ ఒకరు. ఆయన అందించిన పాటలు, మ్యూజిక్ చాలా బాగుంటాయని ప్రేక్షకులు ప్రశంసించినా ఆయనకు మాత్రం ఇప్పటివరకు తగినంత గుర్తింపు రాలేదు. తన అన్న కీరవాణి ప్యాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయినా కల్యాణి మాలిక్ మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆయనకు అవకాశాలు రాకపోవడానికి కారణమేంటో బయటపెట్టారు.


అలా కోరుకోలేదు..


‘‘మనుషులు సమయాన్ని బట్టి మారిపోతుంటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు చాలా అరుదు. రాజమౌళికి కీరవాణి ఫేవరెట్. సుకుమార్‌కు దేవి శ్రీ ప్రసాద్ ఫేవరెట్. కెరీర్ మొదట్లో సుకుమార్ సినిమాలు సరిగా ఆడలేదు. అలా ఫ్లాప్‌ను మ్యూజిక్ డైరెక్టర్ మీద తోసి కొందరు రిలేషన్‌ను కట్ చేస్తారు. ఉదాహరణకు ‘జగడం’ సినిమా ప్రేక్షకులకు సరిగా రీచ్ అవ్వలేదు. అయినా దేవి శ్రీ ప్రసాద్‌ను సుకుమార్ కట్ చేయలేదు. వేరే దర్శకుడు అయితే వెంటనే వేరే హిట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్‌ను చూసుకునేవాడు. సుకుమార్ డైరెక్షన్‌లో నాకు ఛాన్స్ రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. ఎందుకంటే దేవి శ్రీ ప్రసాద్‌తో ఆయన కాంబినేషన్ ఎప్పుడూ బ్రేక్ అవ్వకూడదు. నాతో పనిచేసిన దర్శకులు ఎందుకు వదిలేసి వెళ్లిపోయారని నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను’’ అని ఓపెన్‌గా చెప్పేశారు కల్యాణి మాలిక్.


ఈగో వల్లే..


‘‘ఒక సందర్భంలో మనుషులను ఈగో డామినేట్ చేసేస్తుంది. వేరేవాళ్లతో కూడా నేను మ్యూజిక్ చేయించుకోగలను అనే ఆలోచన వాళ్లకు వస్తుంది. నాతో పనిచేసిన దర్శకులు నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయారు అని కారణాలు కూడా నాకు తెలుసు. కానీ నేను వాటి గురించి చర్చించాలి అనుకోవడం లేదు. నానితో మళ్లీ కలిసి పనిచేయడానికి 100 సార్లు ప్రయత్నించాను. కారణమేంటో నాకు తెలియదు. కానీ కాంబినేషన్ కుదరడం లేదు. కచ్చితంగా తనతో నాకు హ్యాట్రిక్ సినిమా వస్తుంది. రీసెంట్‌గా కూడా ఒక హీరోను వెళ్లి అవకాశం అడిగాను. తరువాతి సినిమా నాతోనే అన్నాడు. కానీ తన అప్‌కమింగ్ చిత్రాలు కూడా అనౌన్స్ అయిపోయాయి. ఒక్కటి కూడా నా వరకు రాలేదు’’ అని వాపోయారు కల్యాణి మాలిక్.


అందుకే తప్పుకున్నాను..


‘‘కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మొగుడు’ సినిమా కోసం దాదాపు రెండు నెలలు కష్టపడ్డాను. ఎన్ని ట్యూన్స్ చేసి వినిపించినా ఆయనకు నచ్చలేదు. ఆయన అంచనాలు నేను అందుకోలేకపోయాను. లేట్ చేస్తున్నానని మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకే చెడ్డపేరు వస్తుందని వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను చూసుకోండి అని నిర్మాతకు మెసేజ్ చేసి తప్పుకున్నాను. కానీ ఇప్పటికీ కృష్ణవంశీని ఎక్కడైనా కలిస్తే బాగా మాట్లాడతారు. క్రియేటివిటీ విషయంలో విభేదాలు వచ్చాయి. కానీ అవేమీ మనసులో పెట్టుకోలేదు’’ అని బయటపెట్టారు కల్యాణి మాలిక్. ఆయన మ్యూజిక్ అందిస్తున్న సినిమాలు చాలావరకు సైలెంట్‌గా వచ్చి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి.


Also Read: సంగీత స్వరకర్త, ఆస్కార్‌ విజేత కీరవాణి బర్త్‌డే - మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆయన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?