తెలుగు సినిమాకు కమర్షియల్ పరంగా కొన్ని లెక్కలు ఉంటాయి. అందులో కథానాయిక పాత్ర కూడా ఒకటి. హీరో హీరోయిన్ మధ్య పాటలు, సన్నివేశాలు, రొమాన్స్ ట్రాక్ కంపల్సరీ అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి, మరీ ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ అలా ఫిక్స్ కాలేదు. రొటీన్ ఫార్ములా నుంచి బయటకు వచ్చి ఆచార్య సినిమా తీశారు. 


'ఆచార్య'లో చిరంజీవికి జోడిగా తొలుత కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగైదు రోజులు చిత్రీకరణ కూడా చేశారు. 'లాహే లాహే...' లిరికల్ సాంగ్ విడుదల చేసినప్పుడు... అందులో కాజల్ కనిపించారు కూడా! సినిమా విడుదల దగ్గర పడిన తర్వాత కాజల్ పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ వివరించారు.


కాజల్ అగర్వాల్ సినిమాలో కనిపించకపోయినా... ఆమెకు ఫుల్ రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఆచార్య కోసం కాజల్ కోటిన్నర (Kajal Aggarwal Remuneration For Acharya) తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ గుసగుస. ఇది ఎంత వరకూ నిజం అనేది ఎప్పటికీ బయటకు రావడం కష్టమే. ఎందుకంటే... ఎవరూ ఫలానా సినిమాకు తాము ఎంత తీసుకున్నామనేది ఏ హీరోయిన్ చెప్పారు. ఫలానా ఆర్టిస్టుకు ఎంత ఇచ్చాం అనేది నిర్మాతలు కూడా చెప్పరు.


''సినిమా అనుకున్నప్పుడు హీరోతో పాటు హీరోయిన్ కూడా ఉండాలని అనుకుంటాం! అలా ఆచార్య లో ఒక మంచి ఫన్నీ క్యారెక్టర్ వచ్చింది. ధర్మస్థలి లో ఉండే మంచి ఫన్నీ క్యారెక్టర్ కు కాజల్ అనుకున్నాం. ఈ సినిమాలో ఆచార్య పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఉండకూడదు! డౌట్ ఉన్నప్పటికీ... ఫస్ట్ షెడ్యూల్ లో మూడు నాలుగు రోజులు షూటింగ్ చేశాం. తర్వాత కరోనా ఫస్ట్ వేవ్ రావడంతో చెక్ చేసుకునే అవకాశం వచ్చింది. పెద్ద కథానాయికను ఏదో క్యారెక్టర్ కోసం అన్నట్టు తీసుకోకూడదు. లవ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పాటలు పెట్టలేం. పాత్రకు సరైన ముగింపు ఇవ్వలేం. ఇన్ని పరిమితులు ఉన్నప్పుడు ఊరికే తీసుకోవడం తప్పు. ఆమెను కూడా తప్పుగా వాడినట్టు ఉంటుంది. చిరంజీవి గారితో తో నా అభిప్రాయం చెప్పినప్పుడు నువ్వు నమ్మినట్టు తీయమని చెప్పారు. కాజల్ అగర్వాల్ తో విషయం చెప్పినప్పుడు అందంగా నవ్వి... 'ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు థాంక్స్. మళ్లీ మనం కలిసి పని చేస్తామని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 'లాహే లాహే...' పాటలో కనిపిస్తారో? లేదో? సినిమాలో చూడండి'' అని ఒక ఛానల్ కు ఇంటర్వ్యూలో కొరటాల శివ తెలిపారు.


Also Read: 'ఆచార్య' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!


చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


Also Read: క్యూట్‌గా ఉన్నాడు, హీరోకు స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్