ఒక్కటే... నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని చెప్పకనే చెప్పారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). బాబాయ్ బాలకృష్ణ కుమారుడు, ఎన్టీ రామారావు కుటుంబంలో మూడో  తరం వారసుడు మోక్షజ్ఞ వెండితెరకు కథానాయకుడిగా పరిచయం కానున్న ప్రకటన వచ్చిన సందర్భంలో తమ్ముడిని సాదరంగా చిత్రసీమలోకి ఆహ్వానించారు.


తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు ఎదగాలని...
''తాత (ఎన్టీఆర్)గారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని నందమూరి కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 'వెల్కమ్ టు ద టిన్సిల్ టౌన్ మోక్షు' అని పేర్కొన్నారు. మోక్షజ్ఞను కుటుంబ సభ్యులు మోక్షు అని పిలుస్తారు. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే.






''సినిమా ప్రపంచంలోకి  అడుగుపెట్టినందుకు కంగ్రాచ్యులేషన్స్. మోక్షు... నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న సందర్భంగా తాతయ్య గారితో పాటు సకల దేవుళ్లు నీకు ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తున్నాను'' అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 






బాలకృష్ణ ప్రస్తావన లేదు కానీ నందమూరి ఫ్యామిలీ ఒక్కటే!
బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని... హరికృష్ణ కుమారులతో నందమూరి కుటుంబానికి సఖ్యత లేదని ఈ మధ్య తరచూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. 


బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకకు ఎన్టీఆర్ గానీ, కల్యాణ్ రామ్ గానీ హాజరు కాలేదు. ఆ సమయంలో తల్లి షాలినితో కర్ణాటకలో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు ఎన్టీఆర్. ఇదొక్కటే కాదు... పలు పరిణామాలు వాళ్ల మధ్య దూరం గురించి చెప్పకనే చెప్పాయని పలువురు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే... తమ్ముడి తొలి సినిమా ప్రకటన వచ్చిన సందర్భంగా అన్నయ్యలు ట్వీట్ చేయడంతో నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని సంకేతాలు వెళ్లాయి. అయితే... తారక్, కల్యాణ్ రామ్ ట్వీట్లలో బాలకృష్ణ పేరు లేకపోవడం గమనార్హం. కేవలం తాతయ్య గారి ఆశీర్వాదం అని మాత్రమే పేర్కొన్నారు.


Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?



ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'పీవీసీయు' (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లో సినిమాతో మోక్షజ్ఞ చిత్రసీమలో అడుగు పెడుతున్నారు. ఆయన సూపర్ హీరో రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా మారారు. లెజెండ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమె సమర్పణలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Also Readవిజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి