జీవితా రాజశేఖర్ దంపతులను నమ్మి తాము రూ. 26 కోట్లు మోసపోయామని, వారితో ఎవరూ సినిమాలు తీయడానికి ముందుకు రాని సమయంలో రూ. 26 కోట్లు ఖర్చు పెట్టి 'గరుడవేగ' తీశామని, తమ దగ్గర ఆస్తులు తాకట్టు పెట్టి వాటిని వేరే వాళ్లకు అమ్మారని జీస్టర్ గ్రూప్ ఫౌండర్ కోటేశ్వర్ రాజు, ఛైర్మన్ హేమ ఆరోపించిన సంగతి తెలిసిందే. శనివారం హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసిన 'శేఖర్' సినిమా  విలేఖరుల సమావేశంలో ఆ ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందించారు.


"నగరిలో కేసు జరుగుతున్న మాట వాస్తవమే. వారెంట్ వచ్చిన మాట నిజమే. అయితే, నేను అరెస్ట్ కాలేదు. అది ఎందుకు వచ్చింది? ఓ కారణం ఉంటుంది. కేసు విషయమై కోర్టు సమన్లు జారీ చేసినప్పుడు మేం కొవిడ్ తో ఇబ్బంది పడుతున్నాం.  మాకు సమన్లు అందకుండా చేశారు. విషయం తెలిశాక, మా న్యాయవాదిని పంపించాం. ఆ కేసు జరుగుతోంది. తీర్పు వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది" అని జీవితా రాజశేఖర్ తెలిపారు.


జీస్టర్ గ్రూప్ తరపున కోటేశ్వర్ రాజు సినిమా నిర్మిస్తే... హేమ ఎందుకు వచ్చారు? ఆయనపై హైదరాబాద్ లో ఏం కేసు ఉంది? ఆయన వల్ల మా మేనేజర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కోర్టులో బయటకు వస్తాయని జీవిత తెలిపారు. నగరి కోర్టులో వారెంట్ జారీ అయ్యి రెండు నెలలు అయ్యిందన్నారు. ఇప్పుడు హేమ, కోటేశ్వర్ రాజు ఎందుకు బయటకొచ్చారో తెలియదన్నారు. తనను డీమోరలైజ్, డీఫేమ్ చేయడం ఎవరి తరమూ కాదన్నారు.


"తప్పు చేసిన రోజు ఒప్పుకొనే ధైర్యం ఉంది. చేయని రోజున భగవంతుడి ముందు నిలబడి మాట్లాడే ధైర్యమూ నాకు ఉంది. వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం ఉండి ఉంటే... కోర్టులో తీర్పు వస్తుంది కదా! అప్పుడు మాట్లాడతా" అని జీవితా రాజశేఖర్ తెలిపారు. తమపై ఆరోపణలు చేసినవాళ్ళు మహాత్ములు కాదని ఆమె అన్నారు. ఆల్రెడీ ఒకసారి కేసు ఓడిపోయారని, వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రూవ్ అవుతుందని జీవిత పేర్కొన్నారు. తాను జైలుకు వెళ్లలేదని తెలిపారు.


Also Read: 'శేఖర్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?


కొన్ని యూట్యూబ్ చాన్నాళ్లు పెట్టిన థంబ్‌నైల్స్‌పై జీవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిగా రాయమని ఆమె సున్నితంగా చెప్పారు. కేసు కోర్టులో ఉంది కనుక ఇంత కంటే  ఎక్కువ మాట్లాడలేనని జీవితా రాజశేఖర్ తెలిపారు.      


Also Read: సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్