అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ బ్యూటీ త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సందర్భాల్లో తారక్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టిన జాన్వీ.. తాజాగా యంగ్ టైగర్ సరసన నటించే ఛాన్స్ దక్కడంపై స్పందించింది. తనకు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలనే కోరిక ఉందని చెప్పింది.


ప్రస్తుతం 'బవాల్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్.. ఇటీవల హీరో వరుణ్‌ ధావన్‌ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ..‘‘నిజంగా ఎన్టీఆర్‌ తో కలిసి పనిచేయడం కోసం నేను చాలా కాలం ఎదురుచూశాను. ‘దేవర’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నన్ను హీరోయిన్‌గా తీసుకుంటే బాగుండని అనుకున్నాను. నాకు ఆ అవకాశం దొరకాలి.. అవకాశం దొరకాలి అని ఒక ఏడాదిపాటు కోరుకున్నాను. చివరకు నాకోరిక తీరింది. ఇప్పుడు నేను ఆయనతో కలిసి షూటింగ్‌ లో పాల్గొంటున్నాను’’ అని చెప్పింది. 


ఇంతకముందు 'మిలి' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా జాన్వీ.. తారక్ తో నటించాలనే తన మనసులోని కోరికను వెలిబుచ్చింది. ''నేను ఇంతకు ముందు చెప్పాను.. మళ్ళీ చెబుతాను. ఎన్టీఆర్ సార్‌ తో పనిచేయాలని ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి లెజెండ్, అలాంటి ఐకాన్ యాక్టర్ తో కలిసి పనిచేయడం ఒక డ్రీమ్'' అని జాన్వీ తెలిపింది. ఇప్పుడు లేటెస్టుగా మరోసారి తారక్ తో నటించడం గురించి తన ఉత్సాహాన్ని పంచుకుంది. 


Also Read: పెళ్లి పుకార్లపై తరుణ్ స్పందన - మెగా ఇంటి అల్లుడు పుకార్లకు చెక్


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో, ఎనర్జిటిక్ డ్యాన్సులు డైలాగ్ డెలివరీలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. RRR సినిమా తర్వాత గ్లోబల్ వైడ్ అందరి దృష్టిని ఆకర్శించారు. అలాంటి యాక్టర్ తో వర్క్ చేయాలని ప్రతీ హీరోయిన్ కూడా కోరుకుంటుంది. అతన్ని ఆరాధించేవారి నటీమణుల లిస్టులో జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది. అలాగే అవకాశం వస్తే హృతిక్‌ రోషన్‌, రణ్‌ వీర్‌ సింగ్‌, టైగర్ ష్రాఫ్‌ లతో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఉందని ఆమె తెలిపింది. సంజయ్‌ లీలా భన్సాలీ, కరణ్‌ జోహార్‌ల దర్శకత్వంలో నటించాలని ఉందని చెప్పింది.  


ఇక 'దేవర' విషయానికొస్తే, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. సైఫ్‌ అలీఖాన్‌ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో.. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ మేకా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


'దేవర' చిత్రాన్ని నందమూరి ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సమకూరుస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2024 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 


Also Read: క్రేజీ అప్డేట్స్‌తో రాబోతున్న స్టార్ హీరోలు, ఈ నెల ఫ్యాన్స్‌కు పండగే పండగ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial