'జబర్దస్త్' కార్యక్రమం గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సూపర్ డూపర్ హిట్ తెలుగు టీవీ షోల్లో అదీ ఒకటి. గత పదేళ్ళుగా విజయవంతంగా కార్యక్రమం కొనసాగుతోంది. 'జబర్దస్త్'తో ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ఆ నటుల్లో 'పంచ్' ప్రసాద్ (Jabardasth Prasad) ఒకరు. ఆయన గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఆయనకు కిడ్నీ సమస్య ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అతి త్వరలో ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


అన్నకు సీరియస్ గా ఉంది - ఇమ్మాన్యుయేల్ పోస్ట్!
ప్రసాద్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆయన తోటి నటుడు, 'జబర్దస్త్' కమెడియన్ ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''అన్నకు సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. మేం అంతా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను'' అని ఇమ్మాన్యుయేల్ పోస్ట్ చేశారు. ఆయన పోస్టులో ప్రసాద్ భార్య సునీత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాతల నుంచి సాయం కోరుతూ ఈ పోస్ట్ చేశారు ఇమ్మాన్యుయేల్!






అసలు ప్రసాద్ ఆరోగ్య సమస్య ఏమిటి?
కిడ్నీ సమస్యల కారణంగా ప్రసాద్ (Punch Prasad health issues)కు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గత ఏడాది నవంబర్ నెలలో ఓసారి ఆయనకు సీరియస్ అయ్యింది. ప్రసాద్ కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఏకంగా నడవలేని స్థితికి చేరుకున్నారు. 


చిత్రీకరణ నుంచి ఇంటికి వెళ్లిన ప్రసాద్ జ్వరంతో పాటు నడవలేక బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు పరీక్షలు చేసి కిడ్నీ సమస్య మరింత తీవ్రతరమైందని డాక్టర్లు చెప్పారు. నడుము వెనక వైపు చీము పట్టిందని వెల్లడించారు. అప్పుడు ఓ ఆపరేషన్ జరిగింది.  ఇందుకు ఆయనకు శస్త్ర చికిత్స చేసినట్లు తెలుస్తోంది. పంచ్ ప్రసాద్ నడవలేని నడవలేని స్థితి నుంచి మళ్ళీ కోలుకుని టీవీ షూటింగులు కూడా చేశారు. ఈ మధ్య టీవీ ప్రోగ్రాంలలో ఆయన కనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య సమస్యలు తిరగబెట్టినట్లు సమాచారం.


Also Read : సెట్‌లో గొడవ నిజమే - మేనేజర్‌ను మార్చేసిన సాయి ధరమ్ తేజ్



లక్షల్లో ఖర్చు అవుతుందని సాయం కోరుతున్న ఇమ్మాన్యుయేల్!
గతంలో ప్రసాద్ చికిత్స కోసం 'జబర్దస్త్' కమెడియన్లతో పాటు పలువురు దాతలు సాయం చేశారు. అప్పట్లో వారందరికీ ప్రసాద్ థాంక్స్ చెప్పారు. ఆయన కోలుకుని మళ్ళీ టీవీ షోలు చేయడం పట్ల ప్రేక్షకులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని, అందుకే ఇమ్మాన్యుయేల్ దాతల సాయం కోరుతూ పోస్ట్ చేశారని 'జబర్దస్త్' ప్రోగ్రాం సన్నిహిత వర్గాలు చెప్పాయి. సినిమా, టీవీ ఇండస్ట్రీలో తమకు తెలిసిన ప్రముఖుల నుంచి సాయం కోరుతూ ఫండ్ రైజింగ్ చేసే పనిలో ఉన్నారట. మళ్లీ  ఆయన కోలుకోవాలని, టీవీ షోలు చేయాలని, ప్రేక్షకులను నవ్వించాలని ఆశిద్దాం. 


Also Read అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ