Kannada Director Narthan : 'RRR' తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భారీ లైనప్ ని సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ తో బిజీగా ఉన్న చరణ్ వెంటనే బుచ్చిబాబుతో సినిమాను పట్టా లెక్కించనున్నాడు. ఈ మూవీ తర్వాత 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఆ మధ్య రామ్ చరణ్ తో కన్నడ దర్శకుడు నర్తన్ ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ప్రశాంత్ నీల్ తో కలిసి నర్తన్ కూడా కనిపించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంతేకాదు UV క్రియేషన్స్ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని సన్నాహాలు చేయగా అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఈ కన్నడ దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్ ని పక్కన పెట్టేసి మరో స్టార్ హీరో పై ఫోకస్ చేసినట్లు తాజా సమాచారం బయటికి వచ్చింది.


విజయ్ దేవరకొండతో సంప్రదింపులు


కన్నడలో 'మఫ్టీ' అనే సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నర్తన్ ఇటీవల రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించగా అది వర్కౌట్ కాకపోవడంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ దర్శకుడు విజయ్ దేవరకొండను కలిసి కథ వినిపించబోతున్నట్లు టాక్. అయితే రామ్ చరణ్ తో తీయాలనుకున్న కథని విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నాడా? లేక ఫ్రెష్ స్టోరీనా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు. దీంతోపాటు మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టాడు.


ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్'


'గీతా గోవిందం' మూవీ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలవల్ల ఈ సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయింది. ఏప్రిల్ 5కి విడుదల కావలసిన ఎన్టీఆర్ 'దేవర' అక్టోబర్ కి పోస్ట్ పోన్ అవడంతో ఆరోజు విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' గా థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.


రష్మిక క్యామియో రోల్


విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెయిర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. పరశురాం డైరెక్ట్ చేసిన 'గీతాగోవిందం' సినిమాతోనే మొదటిసారి వీళ్ళిద్దరూ జంటగా నటించారు. ఆ సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ - పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఫ్యామిలీ స్టార్'లో రష్మిక మందన క్యామియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రష్మిక కొన్ని నిమిషాల పాటూ కనిపించనున్నట్లు సమాచారం.


Also Read : డార్లింగ్ కోసం హాలీవుడ్ హీరోయిన్‌ను రంగంలోకి దింపుతున్న హను రాఘవపూడి