Highest Paid South Indian Actress : హీరోలే కాదు ఈ మధ్య హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్స్ పెంచుతున్నారు. ఒక రెండు సినిమాలు వరుసగా హిట్ అయితే వెంటనే తమ రెమ్యునరేషన్స్ డబుల్ చేస్తున్నారు. యంగ్ హీరోయిన్స్ తో పాటూ సీనియర్ హీరోయిన్స్ సైతం ఇందుకు అతీతం కాదు. గత ఏడాది 'లియో' సక్సెస్ తో త్రిష, 'జైలర్' సక్సెస్ తో తమన్నా వంటి సీనియర్ హీరోయిన్స్ తమ రెమ్యునరేషన్‌ను పెంచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరు? అనే విషయం పై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే చాలామంది రష్మిక, సమంత, తమన్నా, త్రిష లలో ఎవరో ఒకరు అయి ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ వాళ్ళెవరు కాదు. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?


నయనతార


ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు మన లేడీ సూపర్ స్టార్ నయనతార. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. నయనతార తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలకి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. గత ఏడాది షారుక్ ఖాన్ సరసన 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా కోసం ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. అంతేకాదు ప్రస్తుతం సౌత్ ఇండియన్ రిచెస్ట్ హీరోయిన్స్ లో నయనతార ముందు వరుసలో ఉంది. ఆమె నికర విలువ సుమారు రూ.183 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నయనతార కోలీవుడ్లో 'ది టెస్ట్', ' మన్నన్ గట్టి' అనే రెండు సినిమాలు చేస్తోంది.


రెండో స్థానంలో సమంత


సౌత్ లో ఉన్న హీరోయిన్లలో అత్యధిక పారితోషకం తీసుకునేవారిలో సమంత రెండవ స్థానంలో ఉంది. సామ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. సమంత గత చిత్రం 'ఖుషి' కోసం రూ.3.5 కోట్ల వరకు తీసుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన 'సిటాడెల్' సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం OTT లో అత్యధిక పారితోషికం అందుకున్న మొదటి ఇండియన్ హీరోయిన్ గా సమంత నిలిచింది. 


రష్మిక మందన


'యానిమల్' మూవీతో భారీ సక్సెస్ అందుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకు రూ.3 కోట్ల వరకు వసూలు చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న 'పుష్ప 2' సినిమాకి రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా 'యానిమల్'లో రష్మిక రూ.2 కోట్ల వరకు తీసుకుంది.


తమన్నా


ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న తమన్న ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడున్నర కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో గెస్ట్ రోల్ కోసమే ఏకంగా మూడు కోట్ల వరకు తీసుకుంది మిల్కీ బ్యూటీ.


Also Read: ‘సేవ్ ది టైగర్స్’లో ప్రియదర్శి భార్య క్యారెక్టర్ నాదే, ఆ పాత్రలను తక్కువ చేసి చూడొద్దు: రోహిణి