హృతిక్ రోషన్ హీరోగా అతని తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన 'కోయి మిల్ గయా' సినిమా బాలీవుడ్ లో ఓ కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. 2003వ సంవత్సరంలో ఆగస్టు నెలలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆగస్టు 8, 2023 నాటికి ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  ఇండియాలోని 30 ప్రధాన నగరాల్లోని PVR ఐనాక్స్ లో ఆగస్టు 4న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ పై విడుదల చేసి ప్రేక్షకులో మళ్లీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.


ఈ క్రమంలోనే ఈ చిత్ర దర్శకుడు రాకేష్ రోషన్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ 'కోయి మిల్ గయా రీరిలీజ్ ను కన్ఫర్మ్ చేశారు. ఈ క్రమంలోనే రాకేష్ రోషన్ మాట్లాడుతూ.." కోయి మిల్ గయా మూవీకి సంబంధించి 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పివిఆర్ ఐనాక్స్ బృందం మమ్మల్ని సంప్రదించింది. ఇక సినిమా రీరిలీజ్ కు సంబంధించి వాళ్ల దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ గురించి తెలిసి సంతోషించాను. పివిఆర్ బృందంతో కలిసి మేము ఈ సినిమాని ఆగస్టు 4న భారతదేశంలోని 30 ప్రధాన నగరాల్లో రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పివిఆర్ ఐనాక్స్ సినిమాల్లో మళ్లీ విడుదల విడుదల చేయబోతున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను సినిమా హాళ్లకు తీసుకెళ్లి ఈ కొత్త తరానికి పరిచయం చేస్తూ 20 ఏళ్ల క్రితం సినిమా చూసిన జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకుంటారని ఆశిస్తున్నాం" అంటూ పేర్కొన్నారు. 'కోయి మిల్ గయా' సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారనే విషయం అధికారికంగా తెలియజేయడంతో బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇక 'కోయి మిల్ గయా' సినిమా విషయానికొస్తే.. హృతిక్ రోషన్, ప్రీతి జింటా, రేఖ, హన్సిక తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించగా.. అతని సోదరుడు రాజేష్ రోషన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2003 ఆగస్టు 8న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ గా పలు బాలీవుడ్ అవార్డ్స్ ని అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్స్ గా 'క్రిష్' అండ్ 'క్రిష్ 3' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు కూడా బాలీవుడ్లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్ 'వార్ 2' సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.


Also Read : ‘కొటేషన్ గ్యాంగ్’ ట్రైలర్ - ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌‌ను మించిపోయిన ప్రియమణి, సన్నీలియోన్ ముఠా



Join Us on Telegram: https://t.me/abpdesamofficial