మెడియన్ గా కెరీర్ ప్రారంభించి హీరో అవతారమెత్తి, ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా రాణిస్తున్న నటుడు సునీల్. కొన్నేళ్ల పాటు తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టార్ కమెడియన్ గా ఎదిగారు. కేవలం తన యాసతోనూ, ముఖ కవళికలతోనూ, టైమింగ్ తోనూ వినోదాన్ని పండించిన నటుడు అనిపించుకున్నారు. 'అందాల రాముడు' సినిమాతో హీరోగా మారిన సునీల్.. 'మర్యాద రామన్న' 'పూల రంగడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న సునీల్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం!


1974 ఫిబ్రవరి 28వ తేదీన భీమవరంలో జన్మించారు ఇందుకూరి సునీల్ వర్మ. సినిమాల మీద ఆసక్తితో డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఇండస్ట్రీలో డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా విలన్ గా అవకాశాల కోసం ప్రయత్నించారు. చివరకు 2000 సంవత్సరంలో తన స్నేహితుడు, రూమ్ మేట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించిన 'నువ్వే కావాలి' సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. అక్కడి నుంచి కమెడియన్ గా వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయాడు. ఒకానొక సమయంలో సునీల్ కనిపించని సినిమా లేదు అనే స్టేజికి వచ్చేసారు. 


చిన్న సినిమా అయినా పెద్ద చిత్రమైనా సునీల్ కచ్చితంగా ఉండాల్సిందే. ఏడాదికి 20 చిత్రాలకు పైగానే నటించాడంటేనే ఎంత బిజీగా ఉండేవాడో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఆయన.. బంతి, బంకు శీను, బూస్టు, బుల్లెబ్బాయి, పెందుర్తి బాబు, పంచింగ్‌ ఫలక్‌నామా, బుజ్జి, బాబ్జి ఇలా మరెన్నో పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే హాస్య నటుడిగా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 2006 లో 'అందాల రాముడు' సినిమాలో కథానాయకుడిగా మారి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా కమెడియన్ గా కొన్ని సినిమాలు చేసిన సునీల్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'మర్యాద రామన్న' మూవీ హీరోగా అతని కెరీర్ ని మార్చేసింది. 


సునీల్ హీరోగానూ సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. కఠినమైన వర్కౌట్స్ తో సిక్స్ ప్యాక్‌ బాడీని రెడీ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చింది. దీంతో అతని కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న సునీల్.. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. 


హీరో వేషాలు మాత్రమే వేస్తానని కూర్చోకుండా, అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కామెడీ పాత్రలే కాకుండా, విలన్ రోల్స్ చేయడానికి కూడా ఉత్సాహం చూపించారు. ఈ విధంగా నెగెటివ్ షేడ్స్ తో చేసిన 'కలర్ ఫోటో' సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సునీల్ విలన్ వేషాలు కూడా వేయగలడని నిరూపించింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో నటించిన 'పుష్ప: ది రైజ్' సినిమా అతనికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది. ఆయన చేసిన మంగళం శ్రీను పాత్రకు అందరి ప్రశంసలు అందుకున్నారు. 


ప్రస్తుతం సునీల్ పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'మహా వీరుడు' 'జపాన్' వంటి తమిళ చిత్రాలతో పాటుగా 'పుష్ప: ది రూల్', 'జైలర్', 'మార్క్ ఆంటోనీ' వంటి పాన్ ఇండియా సినిమాలల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్యారెక్టర్ ఏదైనా తనదైన నటనతో మెప్పిస్తున్న ఈ భీమవరం బుల్లోడు.. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 'ABP దేశం' ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.