Guntur Kaaram Pre release event postponed: టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. జనవరి 12న మూవీ విడుదల కానుందని ఇదివరకే అప్ డేట్ వచ్చింది. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Guntur Kaaram Pre release event)కు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసింది మూవీ యూనిట్.


ప్రి రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించిన పోలీసులు 
మహేష్ బాబు, శ్రీలీలా ప్రధాన పాత్రల్లో కనిపించనున్న గుంటూరు కారం (Guntur Kaaram Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని దర్శకుడు, నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. యూసుఫ్ గూడా పోలీస్ లైన్స్ లో ఈ భారీ ఈవెంట్ కు నిర్మాతలు ఏర్పాట్లు చేశారు. జనవరి 6న హైదరాబాద్‌లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. కానీ బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ శుక్రవారం నాడు ఓ ప్రకటనలో తెలిపింది. ఈవెంట్ కు కొత్త తేదీని సాధ్యమైనంత త్వరగా ప్రక‌టిస్తాం, మమ్మల్ని క్షమించండి అంటూ మేక‌ర్స్ రాసుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో మరో చోట ఎక్కడ ఈవెంట్ నిర్వహిస్తారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలుపెట్టారు. 






యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు అకస్మాత్తుగా అనుమతిపై యూటర్న్ తీసుకున్నారు. అందుకు ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ తరువాత జరిగిన ఘటనే కారణమని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ ఫినాలే తరువాత పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక ఫ్యాన్స్ వార్ జరిగడం తెలిసిందే. అమర్ దీప్, మరికొందరు కంటెస్టెంట్స్ కార్లపై దాడిచేసి అద్దాలు ధ్వసం చేశారు. అంతటితో ఆగకుండా ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేయడం, ఆపై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పల్లవి ప్రశాంత్ సహా పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.