Mahesh Babu's Guntur Kaaram OTT Release : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొదటి ఆట నుంచి ఈ సినిమాకి డివైడ్ వచ్చింది కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమాలో మహేష్ బాబు మాస్ క్యారెక్టరైజేషన్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి వసూళ్లు భారీగానే వస్తున్నాయి.


ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డివైడ్ టాక్ తో అది కూడా ఓ రీజినల్ సినిమా వారం రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు కొల్లగొట్టడం 'గుంటూరు కారం' సినిమాకు మాత్రమే సాధ్యమైంది. మరే స్టార్ హీరో సినిమా ఈ అరుదైన ఘనతను సాధించలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి విపరీతమైన క్రేజ్ ఉండడం సినిమాకి బాగా ప్లస్  అయ్యింది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈమధ్యకాలంలో చాలావరకు సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాల స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్ దక్కించుకుంటోంది.


అదే తరహాలో ‘గుంటూరు కారం’ రైట్స్‌ను కూడా దక్కించుకుంది. మహేష్ బాబు కెరియర్ లోనే అత్యంత భారీ ధరకు 'గుంటూరు కారం' ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగులో సినిమా థియేటర్లలో విడుదలయిన నెలరోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదనే రూల్ నడుస్తోంది. ఆ రూల్ సినిమా రిజల్ట్‌పై ఆధారపడి మారుతూ కూడా ఉంటుంది. అయితే గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నారట. దాని ప్రకారం జనవరి 12న రిలీజ్ అయిన 'గుంటూరు కారం' ఫిబ్రవరి 10 న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇక దీనిపై నెట్ ఫ్లిక్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సి ఉంది. కాగా గుంటూరు కారం కంటే ముందు రిలీజ్ అయిన 'సలార్' సినిమా విషయంలోనూ నెట్ ఫ్లిక్స్ ఇదే రూల్ పాటించింది. డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అయిన 'సలార్' జనవరి 20 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు 'గుంటూరు కారం' విషయంలోనూ అదే ఫాలో అవుతున్నట్లు సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతం అందించారు.


Also Read : రౌడీ హీరో సినిమా నుండి శ్రీలీల అవుట్ - ఆమె స్థానంలో మరో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు?