ఓటీటీ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వెబ్ సిరీస్ లకు క్రమక్రమంగా క్రేజ్ పెరుగుతుంది. సరికొత్త కంటెంట్ తో వెబ్ సిరీస్లను ను నిర్మించేందుకు అగ్ర దర్శకనిర్మాదులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. పలు ఓటీటీ సంస్థలు కూడా స్వయంగా వెబ్ సిరీస్లను నిర్మించడం విశేషం. ఇటీవల తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ లకు ఆదరణ మరింత పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 'ATM', 'సైతాన్', 'దయ' లాంటి తెలుగు వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదే కోవలో మరిన్ని తెలుగు వెబ్ సిరీస్ లు రూపొందుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.


ఇందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఈటీవీ విన్' 'దిల్ సే' పేరుతో ఓ సరికొత్త వెబ్ సిరీస్ ను రూపొందించింది. అర్బన్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో చాయ్ బిస్కెట్ ఫెమ్ రాజా విక్రమ్, వర్షా హీరో, హీరోయిన్స్ గా నటించారు. భార్గవ్, రోహిణీ రావ్, రాహుల్ వర్మ, రమణ భార్గవ, వీవీ కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 16 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా నేడు(సెప్టెంబర్ 13) 'దిల్ సే' ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.


ఇక ట్రైలర్ను పరిశీలిస్తే.. ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్ళిన హర్ష (రాజా విక్రమ్) పెద్ద సిటీలో ఎలా ఉంటాడోనని వాళ్ల తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే సమయంలో ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరి సిటీ కల్చర్కు బాగా అలవాటు పడతాడు. స్నేహితులతో కలిసి మందు తాగడం, అల్లరి చేయడం లాంటివి చేస్తాడు. అలాగే ఆఫీసులో ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం కూడా నడుపుతాడు. ఇక ఆ అమ్మాయి హర్షతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అయితే ట్రైలర్ లో ఆ అమ్మాయి ఫేస్ చూపించకుండా మాస్క్ ధరిస్తుంది. ఆ మాస్క్ ను ఎలాగైనా తీయించి ఆ అమ్మాయి ఫేస్ ని చూడాలని హీరో పడే పాట్లు నవ్వులు పూయించే విధంగా ఉన్నాయి. ఇక  చివరలో కొన్ని ఎమోషన్ సీన్స్ తో ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.


భరత్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్స్ ని ఒకేసారి కాకుండా ప్రతీ మంగళవారం రోజు ఒక్కో ఎపిసోడ్ ని విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు. నిజానికి వెబ్ సిరీస్ అంటే 6 నుంచి 8 లేదా 8 నుంచి 10 ఎపిసోడ్లు ఉంటాయి. కానీ 'దిల్ సే' వెబ్ సిరీస్ మాత్రం ఏకంగా 12 ఎపిసోడ్లు ఉండడంతో ఒకేసారి అన్ని ఎపిసోడ్లు రిలీజ్ చేస్తే ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు అనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీ అక్కియాన్ మారిసా పతాకంపై శ్రీధర్ మారిసా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించగా.. రాజ్ మేడ, కిరణ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అనుష్క కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజయ్ అరసాడ స్వరాలు సమకూర్చారు.


Also Read : డాన్, లేడీ డాన్ - స్క్రీన్ మీద గ్యాంగ్‌స్టర్స్‌గా అదరగొట్టిన బాలీవుడ్ హీరోయిన్లు





Join Us on Telegram: https://t.me/abpdesamofficial