Emergency Trailer Out: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ కథాంశంతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ దివంగత మాజీ ప్రధాని ఇందిరా పాత్రలో నటించారు. ఈ చిత్రం కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. సెప్టెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ఇవాళ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో భారత్, పాక్ మధ్య యుద్ధం, ఆ సమయంలో ఇందరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల కారణంగా ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ సమయంలో దేశం ఎదుర్కొన్న దారుణాలను చూపించారు.


ఆకట్టుకుంటున్న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్


‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ లో కీలక విషయానులు ప్రస్తావించారు. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత ఇందిర రాజకీయాల్లోకి అడుగు పెడుతుంది. ఆమె ప్రధాని పీఠాన్ని దక్కించుకోవడం, భారత్ పాకిస్థాన్ యుద్ధం, సిమ్లా ఒప్పందం, ప్రతిపక్ష నేతలతో ఆమె వ్యవహరించిన తీరు,  దేశంలో  ఎమర్జెన్సీ విధించడాన్ని ఇందులో ప్రస్తావించారు. “ఈ దేశం నుంచి తనకు ద్వేషం తప్ప మిగిలింది ఏమీ లేదంటూ” ఇందిరా గాంధీ చెప్పడం.. “ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర” అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఇందిర జీవితం షేక్ స్పియరియన్ విషాదం అని ఎందుకు అంటారో ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు.



ఒక్క రోజు ముందుగానే ట్రైలర్ విడుదల


తాజాగా ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్, ఆగష్టు 15న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, చెప్పిన టైం కంటే ఒకరోజు ముందుగానే ట్రైలర్ ను విడుదల చేశారు. నిజానికి ఈ సినిమా గ‌త ఏడాది నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, పోస్టు ప్రొడక్షన్ పనులలో ఆలస్యం కారణంగా చిత్ర విడుదల జూన్ 14కు వాయిదా పడింది. అదే సమయంలో కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశం లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా మరోసారి వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కాబోతోంది.


ఇక ఈ చిత్రంలో  జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నారు.  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ క్యారెక్టర్ ను శ్రేయస్ తల్పడే పోషిస్తున్నారు. మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్‌, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌, మణికర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


Read Also: పాలిటిక్స్ తోనే సరిపోతుంది, వాటికి అస్సలు టైమ్ దొరకట్లేదన్న కంగనా రౌనత్



Read Also: మాటల్లేవ్.. అంతా కోడి గోలే - ‘కల్కీ 2898 ఏడీ’ కైరా లేటెస్ట్ మూవీ ట్రైలర్ చూశారా? ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి