Double Ismart Third Single Out: డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డ‌బుల్ ఇస్మార్ట్’. 2019లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌కు ఇది సీక్వెల్‌. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్‌ను జరుపుకుంటుంది. ఇక ఆగస్ట్‌ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో భాగంగా డబుల్‌ ఇస్మార్ట్ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ ఆడియన్స్‌ని ఖుషి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'డబుల్‌ ఇస్మార్ట్‌' నుంచి థర్డ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. "క్యా ల‌ఫ్డా" అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను విడదల చేసింది. జూలై 29న ఫుల్ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు.  శ్రీ‌హ‌ర్ష ఈమ‌ని సాహిత్యం అందించి ఈ పాటను ధ‌నుంజ‌య్, సింధుజ శ్రీ‌నివాస‌న్ ఆలపించారు. ఇక మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సాంగ్‌ బాగా ఆకట్టుకుంటుంది. 



ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మార్‌ ముంత చోడ్‌ చింత..’ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత   కేసీఆర్ డైలాగ్‌ను వాడటం తీవ్ర దూమారం రేగింది. ఈ విషయమై బీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు డబుల్‌ ఇస్మార్ట్‌ టీంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ కావాలనే కేసీఆర్ డైలాగ్ వాడారని బీర్‌ఎస్ నాయకుల ఆరోపిస్తున్నారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను  ఉద్దేశపూర్వకంగానే కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, మణిశర్మ సంగీతం అందించారు. పాట రచయిత కాసర్ల శ్యామ్‌ పైనా సోషల్‌ మీడియాలో టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.






ఈ విషయంలో పూరీ జగన్నాథ్‌పై కేసు కూడా నమోదు చేశారు. ఐటం సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్‌ను వాడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఎల్బీనగర్ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు జి. సతీష్ కుమార్, ఎం రజితా రెడ్డి ఫిర్యాదు చేశారు. కాగా ఈ సినిమాలో రామ్‌ సరసన అందాల భామ కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ప్రతికథానాయకుడు. ఇక గెటప్ శ్రీ‌ను, అలీ, షాయాజీ షిండే, మార్కండ్ దేశ్పాండే, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై పూరి జ‌గ‌న్నాధ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 15న రిలీజ్ చేయనున్నారు.



Also Read: ఫస్ట్‌టైం 'యానిమల్‌' వివాదంపై స్పందించిన రణ్‌బీర్‌ - మరోసారి ఇలాంటి సినిమా చేయనన్నాను..