Double iSmart Release Date : టాలీవుడ్ లో ఈ ఏడాది రానున్న అగ్ర హీరోల పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అవ్వడం ఎంత హాట్ టాపిక్ అవుతుందో తెలిసిందే. ఎన్టీఆర్ 'దేవర', అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రభాస్ 'కల్కి', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' లాంటి చిత్రాలు వాయిదా పడబోతుండడంతో వాటి స్థానంలో మీడియం బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 'పుష్ప2' రిలీజ్ డేట్ పై అరడజనుకు పైగా సినిమాలు కన్నేసాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ పై మరో సినిమా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


'కల్కి' రిలీజ్ డేట్ పై కన్నేసిన 'డబుల్ ఇస్మార్ట్'


డైరెక్టర్ పూరి జగన్నాథ్ - ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొదట ఈ సినిమాని శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేయాలని అనుకున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. కానీ సినిమాకు సంబంధించి ఇంకా పెండింగ్ వర్క్ ఉండడంతో మే నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.


అది కూడా 'కల్కి' రిలీజ్ డేట్ అయిన 9 కి 'డబుల్ ఇస్మార్ట్' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ 'కల్కి' రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వకుంటే మే 23 మరో ఆప్షన్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ రెండిట్లో ఏదో ఒక డేట్ ని డబుల్ ఇస్మార్ట్ టీమ్ రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


'పుష్ప2' పోస్ట్ పోన్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు.. 


 అల్లు అర్జున్ 'పుష్ప 2' కనుక పోస్ట్ పోన్ అయితే దాదాపు ఆరు సినిమాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ సినిమాని ఆగస్టు నుంచి పోస్ట్ పోన్ చేస్తే ఆ నెలలో కమల్ హాసన్ 'ఇండియన్ 2', సూర్య కంగువ, రజనీకాంత్ 'వెటయాన్', ఎన్టీఆర్ 'దేవర', నాని 'సరిపోదా శనివారం', అజయ్ దేవగన్ 'సింగం అగైన్' వంటి సినిమాలు థియేటర్స్ లోకి రావాలని చూస్తున్నాయి. 'పుష్ప 2' కోసం టాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమా పోస్ట్ పోన్ అయితే తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాలు సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి.


'ఇస్మార్ట్ శంకర్' కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్'


పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ మరోసారి ఈ సీక్వెల్ కి మ్యూజిక్ అందిస్తున్నారు.


Also Read : చిరంజీవి దగ్గరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ దర్శకుడు!