జినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇటీవల తన ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన ఇంటి పనివారిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. చివరికి ఆమె అనుమానమే నిజమైంది. ఆ ఇంట్లో పనిచేసే ఓ మహిళ, డ్రైవర్ కలిసి.. ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీరు గత 18 ఏళ్లుగా ఐశ్వర్యకు ఎలాంటి అనుమానం రాకుండా నగదు చోరీలు చేస్తూ ఏకంగా ఇల్లే కట్టేశారు. 


ఐశ్వర్య రజినీకాంత్‌ ఫిబ్రవరి నెలలో పోలీసులను ఆశ్రయించారు. చెన్నైలోని తన ఇంట్లో దాచిన సుమారు 60 సవర్ల బంగారం, వజ్రాల నగలు కనిపించడం లేదని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆభరణాల విలువ, అనుమానితుల వివరాలు చెప్పాలని ఆమెను కోరారు. తన డైమండ్ సెట్‌లు, టెంపుల్ జ్యువెలరీ, నవరత్నాల సెట్లు, పాత బంగారం, గాజులు తదితర ఆభరణాలన్నీ తన ఇంటి లాకర్‌లోనే పెట్టానని.. చివరిసారిగా వాటిని 2019లో చూశానని పేర్కొన్నారు. తన సోదరి సౌందర్య పెళ్లి తర్వాత తిరిగి వాటిని ఆ లాకర్‌లోనే పెట్టేశానని వెల్లడించారు. అప్పటి నుంచి తాను ఆ నగలను వేసుకోలేదని తెలిపారు. తన ఇంట్లో పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకటేశన్‌లపై అనుమానం ఉందని తెలిపారు. తాను ఇంట్లో లేనప్పుడు వారు మాత్రమే తన ఇంటికి వచ్చేవారని, తాళాలు ఎక్కడ పెడతానో వారికి తెలుసని ఐశ్వర్య పేర్కొంది. దీంతో పోలీసులు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.


పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. మండావలీ ప్రాంతానికి చెందిన ఈశ్వరి (46) అనే మహిళ ఐశ్వర్య ఇంట్లో సుమారు 18 ఏళ్ల నుంచి పనిచేస్తోందని, తిరువెరకడుకు చెందిన కె.వెంకటేశన్ అనే డ్రైవర్‌తో గత కొన్నాళ్లుగా ఆ ఇంట్లోని విలువవైన వస్తువులు, నగలు చోరీ చేసిందని పోలీసులు తెలిపారు. అన్నీ ఒకేసారి చోరీ చేస్తే అనుమానం కలుగుతుందనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వాటిని దొంగిలించేవారని పేర్కొన్నారు. అలా దొంగిలించిన ఆభరణాలతో ఆమె చెన్నైలో ఒక ఇల్లు కూడా నిర్మించింది. అలాగే కొన్ని విలువైన వస్తువులను సైతం కొనుగోలు చేసిందని తెలిపారు. అయితే ఐశ్వర్య ఫిర్యాదులో పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు వారు చోరీ చేసినట్లు విచారణలో తేలింది. ఐశ్వర్య ఇంటి నుంచి సుమారు 100 సవర్ల బంగారం, 30 గ్రాముల డైమండ్ నగలు, నాలు కిలోల వెండి సామాన్లు, కొన్ని విలువైన డాక్యుమెంట్లను దొంగిలించినట్లు పోలీసులు వివరించారు. ఇప్పటికే వాటిని నగదుగా మార్చివేసినట్లు తేలింది. 


Also Read : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?


ప్రస్తుతం ఐశ్వర్య ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో రజనీ కాంత్ కూడా ఓ అతిథి పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 8న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లగా, ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. క్రికెట్ అలాగే రాజకీయాల నేపథ్యంలో మూవీ కథ ఉండబోతోందని సమాచారం.