'ఆర్య' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన సుకుమార్.. ఫస్ట్ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. తన మార్క్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే సుక్కూ మాదిరిగానే ఆయన శిష్యులు కూడా బ్లాక్ బస్టర్స్ కొడుతూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

 

సుకుమార్ జీనియస్ డైరెక్టర్ గా ఒక స్థాయి అందుకున్నప్పటి నుంచి, తన అసిస్టెంట్లను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా వారికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో సుక్కూ శిష్యుల డామినేషన్ బాగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో డిఫరెంట్ సినిమాలు తీసి, ప్రేక్షకులను అలరిస్తున్నారు. గురువుకు తగ్గ శిష్యులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘దసరా’, ‘విరూపాక్ష’ సినిమాలే ఇందుకు నిదర్శనం. అంతేకాదు, ఆయన స్కూల్ నుంచి వచ్చిన ఇతర శిష్యులు కూడా హిట్లు కొట్టేశారు. వారెవరో చూసేయండి మరి. 


కుమారి 21F


'కరెంట్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F' తో మంచి సక్సెస్ అందుకున్నాడు. గతేడాది చివర్లో సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే సమకూర్చిన '18 పేజెస్' సినిమాను సూర్యప్రతాపే తెరకెక్కించాడు.


ఉప్పెన


'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు సనా.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బుచ్చి సుకుమార్ కు ప్రియ శిష్యుడు. అనేక సినిమాలకు ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్ లో డైరక్టర్ గా లాంచ్ చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు బుచ్చిబాబు.

దసరా


టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీకాంత్ ఓదెల కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరడమే కాదు.. యుఎస్ లో 2 మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో ఒక్క దెబ్బతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పటికే బడా బ్యానర్లు అడ్వాన్సులు ఇవ్వడానికి యువ దర్శకుడి వెంట పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. 

విరూపాక్ష


‘భమ్ భోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ దండు కూడా సుకుమార్ దగ్గర శిష్యరికం చేశాడు. సుకుమార్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. 

 

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. ‘పుష్ప’, ’18 పేజీస్’ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుక్కూకి సపోర్ట్ గా నిలిచిన శ్రీకాంత్.. 'పుష్ప 2' సినిమాలోనూ భాగం అవుతున్నాడు. అలానే డెవిల్, టైగర్ నాగేశ్వరరావు వంటి రెండు పాన్ ఇండియా సినిమాలకు రైటర్ గా పనిచేస్తున్నాడు.

 

'దర్శకుడు' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జక్కా హరి ప్రసాద్.. ఎన్నో సినిమాలకి సుక్కుతో కలసి వర్క్ చేసాడు. ‘100% లవ్’ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. 

 

డైరక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ సైతం 'ఆర్య' సినిమాకి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. సుక్కూ శిష్యుల్లో ఒకరైన వేమారెడ్డి త్వరలో ఓ బిగ్ ప్రాజెక్ట్ కోసం మెగాఫోన్ పట్టబోతున్నాడు.

 

ఇలా సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన చాలామంది ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన దర్శకులుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఓవైపు గురువు బ్లాక్ బస్టర్స్ కొడుతుంటే.. మరోవైపు ఆయన అసిస్టెంట్లు కూడా సత్తా చాటుతున్నారు. చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుంచి దర్శకులు వచ్చినట్లే.. రాబోయే కొన్నేళ్ళలో టాలీవుడ్ లో సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన శిష్యుల హవానే కొనసాగేలా కనిపిస్తోంది.