Nag Ashwin Spinoff Plans For Kalki Cinematic Universe: నాగ్ అశ్విన్ అద్భుత సృష్టి ‘కల్కి 2898 AD’ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. తొలి భాగం అద్భుతంగా ఆకట్టుకోవడంతో రాబోయే చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన దర్శకుడు వచ్చే భాగంలో అసలు కథ చెప్పనున్నారు. అయితే, ‘కల్కి 2898 AD’ సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధించి కొత్త సినిమాలు, సిరీస్ లు ఉంటాయా? అని సందేహాలపై నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘కల్కి 2898 AD’ ప్రాంచైజీలో బోలెడు సినిమాలకు అవకాశం


దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఓ ఇంటర్యూలో ‘కల్కి 2898 AD’ ప్రాంచైజీలో స్పిన్ ఆఫ్ ఛాన్సుల గురించి కీలక విషయాలు వెల్లడించారు. “నిజానికి ‘కల్కి 2898 AD’ యూనివర్స్ లో చాలా క్యారెక్టర్లతో కొత్త సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. అయితే, వాటి గురించి నేను ఏం ఆలోచించలేదు. ఏం రాయలేదు కూడా. ఈ సినిమాను చాలా రకాలుగా ప్రేక్షకులకు చూపించే అవకాశం ఉంది” అని వివరించారు. దుల్కర్ సల్మాన్, శోభన, పశుపతి పాత్రల ఆధారంగా కొత్త కథల తయారీకి ఆస్కారం ఎక్కువగా ఉందని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. “దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ గురించి ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు. అతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో ఉంది. శోభన, పశుపతి యంగ్ ఏజ్ లోకి వెళ్లి మానస్‌తో ఎలా పోరాడారో చూడవచ్చు. పశుపతిని వేరే మిషన్‌లో భాగం చెయ్యొచ్చు. నిర్మాతలు సరైన బడ్జెట్ పెట్టగలిగితే, ఈ సినిమాటిక్ యూనివర్స్ లో కొత్త కథలకు అంతులేని అవకాశాలు ఉన్నాయి” అని నాగ్ అశ్విన్ వెల్లడించారు.


‘కల్కి 2898 AD’ రిలీజ్ కు ముందే బుజ్జి, భైరవ పరిచయం


అటు ‘కల్కి 2898 AD’ సినిమా విడుదలకు ముందే బుజ్జి, భైరవ అనే రెండు యానిమేటెడ్ సిరీస్ లను మేకర్స్ తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ లు విడుదల అయ్యాయి. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ భైరవ గురించి, స్పెషల్ కారు బుజ్జితో అతడికి ఉన్న అనుబంధం గురించి ఇందులో వివరించారు.      


ఇక ‘కల్కి 2898 AD’ సినిమా మొత్తం కల్పిత ప్రపంచాల్లో కొనసాగుతుంది. కాశీ, కాంప్లెక్స్, అంబాలా అనే లోకాల్లో ఈ సినిమా కథ నడుస్తుంది. కాంప్లెక్స్ సుప్రీమ్ యాస్కిన్(కమల్ హాసన్) విష్ణువు 10వ అవతారం కల్కిని రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. యాష్కిన్ ను ఎదిరించే పాత్రలో అశ్వాత్థామ(అమితాబ్) కనిపిస్తారు. కాంప్లెక్స్ లోకి వెళ్లేందుకు భైరవ(ప్రభాస్) ప్రయత్నిస్తాడు. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీతో ప్రధాన పాత్రలు పోషించారు. పలువురు నటీనటులు ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించారు.


Also Read: భారతీయుడు 2 రివ్యూ: శంకర్ మార్క్ మిస్ - కమల్, సిద్ధూ సూపర్ - సినిమా ఎలా ఉందంటే?



Also Read: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?