Dil Raju : వేణు టిల్లు దర్శకత్వంలో రూపొందిన 'బలగం' సినిమా విజయంతో ఆనందంలో ఉన్న సినీ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు తమిళ సినిమాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే విజయ్ దళపతి హీరోగా 'వారిసు' తమిళ వెర్షన్ తీసిన దిల్ రాజు.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


చిన్న సినిమానే అనుకున్నా.. ఎలాంటి హయ్యెస్ట్ ఎక్స్పెప్టేషన్స్ లేకపోయినా.. కేవలం రూ.16 లక్షలతో ప్రముఖ కమెడియన్ టిల్లు వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన 'బలగం' రీసెంట్ డేస్ లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా పోస్టర్, ట్రైలర్ రిలీజైన నాటి నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత రిలీజ్ చేసిన పాటలు మూవీపై పాజిటివ్ టాక్ వచ్చేందుకు కారణమయ్యాయి. అలా ముందు నుంచే మంచి రెస్పాన్స్ వస్తోన్న 'బలగం' సినిమా ఈ రోజు ఓ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. తెలంగాణలోని పల్లెలు, బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయత, ప్రేమ లాంటి మనిషికున్న అన్ని ఎమోషన్స్ ను అందరికీ అర్థమయ్యేలా వేణు చక్కగా తీయడంతో.. ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎంతో కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమాను ప్రతి పల్లెలోనూ ఉచితంగా గ్రామ పంచాయితీ సిబ్బందే ప్రదర్శనగా వేసి చూపిస్తుండడం గమనార్హం. 


అంత గొప్ప, మంచి సినిమా 'బలగం'ను నిర్మించిన దిల్ రాజుకు ఆయన కెరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. మొన్నటివరకూ ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ లు, పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న దిల్ రాజు.. ఇప్పుడు తాను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు. అందులోనూ తమిళ సినిమాలపై చూపు మళ్లినట్టు తెలుస్తోంది. 


ఇంతకుమునుపే తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దిల్ రాజు.. టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ తో 'వారిసు' తీశారు. ఈ మూవీ ఏకకాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా భారీ సక్సెస్ ను మూట గట్టుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం  వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించగా.. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడంలో ఇప్పటికే దిట్ట అయిన దిల్ రాజు.. ఇప్పుడు మరో తమిళ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ కు తగిన కథ ఒకటి సెట్‌ చేశారని, ఇందులో నటించడానికి రజనీకాంత్‌ కూడా అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఈ సినిమా కోసం దిల్ రాజు పెద్ద మొత్తంలోనే అడ్వాన్స్‌ను చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ రూమర్సే గనక నిజమైతే ఈ ప్రాజెక్ట్ కి ఎవరు దర్శకత్వం వహిస్తారోనని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ’జైలర్‌’లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జై భీమ్‌’ ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇది రజనీ 170వ చిత్రం కావడం విశేషం. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే రజనీ కాంత్, దిల్‌ రాజు బ్యానర్‌లో సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో దిల్ రాజు చేస్తోన్న మరొక పెద్ద ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగా... స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం ఈ పొలిటికల్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహిస్తు్న్నారు.


Also Read : అనుపమలో ఇంత టాలెంట్ ఉందా? షార్ట్ ఫిల్మ్‌కు సినిమాటోగ్రఫీ