Digital rights of Hrithik Roshan’s Fighter grabbed by this OTT platform : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'. బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డైరెక్టర్ హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్, వార్, సినిమాలను తెరకెక్కించాడు. ఇక తాజాగా వీరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో 'ఫైటర్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది.

 

సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఫైటర్ మూవీకి సంబంధించి ఓటీటీ స్క్రీనింగ్, డిజిటల్ పార్టనర్ తదితర వివరాలు బయటకు వచ్చాయి. 'ఫైటర్' మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఫైటర్ ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. థియేటర్లో విడుదలైన 56 రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

 

ఈ సినిమా ఓటీటీ డీల్ ని మాట్లాడుకున్నప్పుడే థియేట్రికల్ రిలీజ్ తర్వాత 56 రోజులకు ఓటీటీలో రిలీజ్ చేసేలా అగ్రిమెంట్ జరిగిందట. దాని ప్రకారం ఫైటర్ మూవీ మార్చ్ మూడు లేదా నాలుగో వారంలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఫైటర్ మూవీతో ఏరియల్ ఫ్రాంచైజ్ అని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఫ్రాంచైజీలో మొదటి సినిమాగా ఫైటర్ రాబోతోంది. ఆ తర్వాత ఇదే ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలు రానున్నట్లు సమాచారం. కాగా దేశభక్తి నేపథ్యంలో వస్తున్న ఫైటర్ మూవీని గల్ఫ్ దేశాలు నిషేధించాయి. ఒక యూఏఈ తప్పితే మిగతా 6 గల్ఫ్ దేశాలు ఫైటర్ మూవీ విడుదలపై నిషేధాన్ని ప్రకటించాయి.

 

సినిమాలో తీవ్రవాదం, భారత్ - పాకిస్తాన్ మధ్య వివాదానికి సంబంధించిన సన్నివేశాలు ఉండడంతో గల్ఫ్ దేశాలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ గల్ఫ్ దేశాల్లో ఫైటర్ సినిమాని ఎందుకు బ్యాన్ చేశారనే విషయాన్ని మూవీ టీమ్ ఇప్పటివరకు వెల్లడించకపోవడం గమనార్హం. ఇక ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం అందించారు.