2023 ఆస్కార్ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆస్కార్ రేస్ లో మొట్టమొదటిసారి రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా సంచలనం సృష్టిస్తూ 'నాటు నాటు' సాంగ్ కి అవార్డు సొంతం చేసుకుంది. మొదటిసారి ఓ తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కడం భారతదేశానికే ఓ తీపి గుర్తుగా మారింది. ఇక వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టేసారు. 2024 ఆస్కార్ అవార్డుల్లో కూడా ఇదే జోరు ఇండియన్ సినిమాలు ప్రదర్శిస్తాయా అనే ఆసక్తి సైతం అందరిలో కనిపిస్తోంది.


ఈ క్రమంలోనే ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ పోటీలోకి ఎంట్రీ ఇచ్చే సినిమాలు ఏవి? ఆపై ఫైనల్ నామినేషన్స్ లో అర్హత సాధించే చిత్రాలు ఏవి? అనే లెక్కలు మొదలైపోయాయి. తాజాగా ప్రముఖ కన్నడ నిర్మాత గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన మొత్తం 17 మంది సభ్యులతో ఇండియ నుంచి ఆస్కార్‌కి ఎంపిక చేసే చిత్రాల జాబితా తయారు చేసేందుకు చెన్నైలో కసరత్తు మొదలైంది. దీనిపై అధికారిక సమాచారం లేదు, కానీ టాలీవుడ్ నుంచి ఈ ఏడాది కేవలం రెండు సినిమాలు మాత్రమే ఆస్కార్ ఎంట్రీ కి పోటీ పడే చిత్రాల లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది.


అందులో ఒకటి నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' కాగా మరొకటి వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన 'బలగం' సినిమాలు అని సమాచారం. ఇందులో దసరా సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో మద్యపానం, కుల వివక్షత, పెత్తందారితనం లాంటి సామాజిక అంశాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. ఫ్రెండ్షిప్ ని కూడా చాలా ఎమోషనల్ గా చూపించారు. అలాగే నాని, కీర్తి సురేష్ ల లవ్ స్టోరీ కూడా ఎంతో న్యాచురల్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి ఎంతగానో కనెక్ట్ అయ్యారు. నాని ఈ సినిమాతో మొదటి పాన్ ఇండియా హిట్ అందుకున్నారు.


ఇక బలగం విషయానికొస్తే.. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కుటుంబ బంధాలని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ కనబరిచారు. సినిమాలో నటించిన ప్రతి నటీనటులు తమ తమ పాత్రలో ఒదిగిపోయారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో కంప్లీట్ తెలంగాణ నేటివిటీలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. దీంతో ఇండియన్ నుంచి ఆస్కార్ బరిలో నిలిచే చిత్రాల జాబితాలో చోటు దక్కించుకునేందుకు టాలీవుడ్ నుంచి ఈ రెండు చిత్రాలు మాత్రమే పోటీలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. బలగం సినిమాని నిర్మించిన దిల్ రాజు గతంలో కూడా ఈ చిత్రాన్ని ఆస్కార్ కి పంపే ప్రయత్నం చేస్తామని అన్న విషయం తెలిసిందే.


మరోవైపు ఈ రెండు సినిమాల్లో ఆస్కార్ అవార్డు అందుకునే అవకాశం బలగం సినిమాకే ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఏకంగా 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. వాటిల్లో దసరా (తెలుగు), బలగం(తెలుగు), ది స్టోరీ టెల్లర్‌ (హిందీ), మ్యూజిక్‌ స్కూల్‌ (హిందీ), మిస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే (హిందీ), 12 ఫెయిల్‌ (హిందీ), ది కేరళ స్టోరీ, విడుదలై పార్ట్‌-1 (తమిళం), ఘూమర్‌ (హిందీ), వాల్వి (మరాఠీ), గదర్‌-2 (హిందీ), అబ్‌ థో సాబ్‌ భగవాన్‌ భరోస్‌ (హిందీ), బాప్‌ లాయక్‌ (మరాఠీ), రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్ కహానీ, జ్విగాటో చిత్రాలు ఉన్నట్లు సమాచారం.


Also Read : ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial