Guntur Kaaram New Poster : సూపర్ స్టార్ మహేశ్ బాబు తరువాతి సినిమా ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కినవి రెండు సినిమాలే అయినా.. ఈ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుంది అని తెలియగానే ఏ వివరాలు తెలియకపోయినా.. మూవీపై అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. అప్పటినుంచి వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విడుదలయిన ప్రతీ పోస్టర్‌లో మహేశ్‌ను మాస్ లుక్‌ను చూపించాడు త్రివిక్రమ్. కానీ మొదటిసారి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్‌లో మాస్ కాకుండా క్లాస్ మహేశ్ బాబును చూపించాడు.


‘ఒక్కడు’ తర్వాత మళ్లీ ‘గుంటూరు కారం’లోనే..


‘గుంటూరు కారం’ అనే టైటిల్‌లోనే చాలా మాస్ ఉంది. దానికి తగినట్టుగా.. ఈ సినిమాలో నుండి మహేశ్ ఫస్ట్ లుక్‌ను రెడ్ షర్ట్, బీడీతో రిలీజ్ చేశాడు. ‘ఒక్కడు’ తర్వాత మహేశ్ బాబు సిగరెట్, బీడీ తాగుతూ ఎప్పుడూ కనిపించలేదని ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. కేవలం ఆ పోస్టర్‌లోనే కాదు.. అప్పటినుండి విడుదలవుతున్న ప్రతీ పోస్టర్‌లో మహేశ్ బీడీతోనే కనిపించాడు. కానీ క్రిస్మస్ పోస్టర్‌లో మహేశ్ చేతిలో బీడీ లేదు. బ్లాక్ షర్ట్‌లో క్లాస్ లుక్‌తో, సింపుల్ స్మైల్‌తో తన ప్రేక్షకులను మరోసారి ఫిదా చేశాడు మహేశ్. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్‌ను చూసి ‘ఓ మై బేబీ’ అంటూ పాటలు పాడేస్తున్నారు. 2024 జనవరి 12న ‘గుంటూరు కారం’ విడుదల కానుందని క్రిస్మస్ స్పెషల్ పోస్టర్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.






రెండు పాటలు రిలీజ్..


ఇప్పటినుండి ‘గుంటూరు కారం’ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి ‘దమ్ బిర్యానీ’ పాట విడుదలయ్యింది. మహేశ్ మాస్ కటౌట్‌కు సరిపోయేలా ఉన్న ఈ పాట వెంటనే మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసేసింది. ఆ తర్వాత ఒక ప్రేమపాటను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇది మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల.. మహేశ్ కోసం పాడే పాట. ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటకు ముందుగా ఆడియన్స్ నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కానీ మెల్లగా ఇది మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. దీంతో ‘ఓ మై బేబీ’ పాటకు యూట్యూబ్‌లో మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి.


మెసేజ్ వద్దు ప్లీజ్..


మహేశ్ బాబు.. తన గత సినిమాల్లో ఏదో ఒక మెసేజ్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మహేశ్ లాంటి హీరోకు మాస్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉండడంతో ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ కథలు తనకు సూట్ అవ్వడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తను చేస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ కథలు హిట్టే అవుతున్నా కూడా అలాంటి కథల్లో మహేశ్ పూర్తిస్థాయి యాక్టింగ్‌ను ఎవరూ వినియోగించుకోవడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కనీసం ‘గుంటూరు కారం’ అయినా.. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ కథల క్యాటగిరీలో చేరకపోతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరీ నటిస్తోంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Also Read: ‘డుంకీ‘ డైరెక్టర్ ఫోన్ చేసి ఆ రూమర్ నిజం చేద్దామన్నారు.. మరిచిపోవడానికి చాలా టైమ్‌ పట్టింది