కొందరు హీరోలు ఎంత సీనియర్స్ అయినా కూడా తమ సహాయ నటులతో పాటు అందరితో చాలా సరదాగా ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా చిరు గ్రేసే వేరు. ఈవెంట్స్‌లో, ఇంటర్వ్యూలలో కూడా చిరు చాలా సరదాగా ఉంటారు, సెటైర్లు వేస్తుంటారు, జోక్‌లు కూడా వేస్తుంటారు. ముఖ్యంగా ఆయన మూవీ ప్రమోషన్స్ సమయంలో మెగాస్టార్ ఇచ్చే స్టఫ్పే వేరు. త్వరలోనే ‘భోళా శంకర్’ విడుదల ఉండడంతో ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. అదే సమయంలో మేకింగ్ వీడియోలో ఆయన కీర్తి సురేశ్ గొంతు ఎందుకు పట్టుకున్నారు అనే విషయంపై వివరణ ఇచ్చారు.


సరదా ఇంటర్వ్యూ..
ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. విడుదలకు ఇంకా కొన్నిరోజులే ఉండడంతో మూవీ టీమ్.. ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. తాజాగా గెటప్ శ్రీను.. ‘భోళా శంకర్’ టీమ్‌తో ఒక ఇంటర్వ్యూను హోస్ట్ చేశాడు. అందులో సినీ నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేశ్‌తో పాటు మూవీలో లీడ్ రోల్స్ చేసిన చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ పాల్గొన్నారు. ఇంటర్వ్యూ మొత్తం చాలా సరదాగా, చిలిపి ప్రశ్నలతో సాగింది. ముందుగా తమన్నా, కీర్తి సురేశ్‌ను పరిచయం చేసింది చిరునే అని తెలిపారు. కానీ తర్వాత వారిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయి తనను పక్కన పెట్టేశారని చిరు వారిని ఆటపట్టించారు.


‘భోళా శంకర్’ సినిమాలో ‘జాం జాం జజ్జనక’ అనే సెలబ్రేషన్ సాంగ్ ఉంది. అయితే ఈ సాంగ్.. ప్రేక్షకుల ముందకు రాకముందే చిరు లీక్స్‌లో భాగంగా దీని మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగాస్టార్. ఈ మేకింగ్ వీడియోలో మొత్తం చాలా సరదా వాతావరణం  కనిపించింది. అయితే ఇందులో ఒక చోట చిరు.. కీర్తి సురేశ్ పీక పట్టుకున్నారు. అది సరదాగానే అనిపించినా.. అసలు అలా ఎందుకు చేశారు అని చాలామంది అభిమానులకు ఒక డౌట్ మిగిలిపోయింది. ఇక గెటప్ శ్రీనుతో జరిగిన ఇంటర్వ్యూలో చిరంజీవిని ఇదే ప్రశ్న అడిగాడు. అయితే ఇండియా మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఎదురుచూస్తుంది అంటూ తమన్నా ఆటపట్టించింది.


భోజనం దగ్గరే గొడవ..
కీర్తి సురేశ్ పీక పట్టుకోవడానికి అసలు కారణం ఏంటో చిరంజీవి చెప్పుకొచ్చారు. ‘‘కీర్తి హైదరాబాద్‌లో నాకు ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు అనేది. అయితే అడగొచ్చు కదా ఫుడ్ పంపించేవాడిని అని అంటే అదే చూస్తున్నాను అని చెప్పింది. అప్పటినుంచి మా ఇంటి నుంచి తనకు కావాల్సినవి వచ్చేవి. మా ఇంటి నుంచి తనకు కావాల్సిన తమిళ ఫుడ్ కానీ, తెలుగు ఫుడ్ కానీ రోజూ తనకు పంపిస్తుండేవాడిని. ప్రతీరోజూ చాలా వెరైటీలు డిమాండ్ చేసేది. నా గురించి ఇది చేసి పెట్టండి అని అడగను.. కానీ తన గురించి మాత్రం చెఫ్ చాలా వెరైటీలు చేసేవాడు. అన్నీ తిని చాలా బాగుంది అని చెప్పేది. ఏదైనా తేడాగా ఉంటే అది కొంచెం తగ్గింది, ఇది కొంచెం తగ్గింది, మళ్లీ సెట్ చేసి పంపించమనండి అనేది. ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా అన్నాను. ఆ తర్వాత రేపు ఏం పంపిస్తున్నారు అని అడగగానే పీక పట్టుకున్నాను’’ అంటూ భోజనం గురించి తనకు, కీర్తికి మధ్య జరిగిన సరదా సంభాషణలను బయటపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.


Also Read: హార్ట్‌లో రెండు హోల్స్‌తో పుట్టింది, కూతురి గురించి చెప్తూ ఎమోషనల్ అయిన బిపాసా బసు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial