ఏడాది 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి  ఇప్పుడు 'భోళాశంకర్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా 'భోళా శంకర్' మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకర, హీరోయిన్స్ తమన్నా, కీర్తి సురేష్ పాల్గొనగా.. గెటప్ శీను మూవీ టీంని ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి కీర్తి సురేష్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఈ మేరకు చిరంజీవి మాట్లాడుతూ.."పున్నమి నాగు.. సినిమాలో కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ (మేనక)తో కలిసి నేను నటించాను. ఆ తర్వాత మేము కలిసినప్పుడల్లా తాను కీర్తి సురేష్ గురించి చెబుతూ ఉండేది. ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ నటన చూసి ఆశ్చర్యపోయాను. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను ఎంతో ఆనందించాను. ఆ ఆనందాన్ని మూవీ టీంతో పంచుకోవడానికి నేను వాళ్ళని ఇంటికి పిలిచాను. కానీ అప్పుడు కీర్తి సురేష్ ని మిస్సయ్యాను. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి మహానటి సినిమాలో ఎంత అద్భుతంగా నటించిందని నా సంతోషాన్ని ఆమెతో పంచుకున్నాను. ఇక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కీర్తి సురేష్ కి మెసేజ్ ద్వారా నా అభినందనలు తెలిపాను. అప్పటినుంచి కీర్తి సురేష్ సినిమాలు చూడడం మొదలు పెట్టాను. మొన్న కూడా వడివేలుతో కలిసి నటించిన 'మామన్నన్' సినిమా చూశాను. ఆ సినిమాలో కూడా చాలా బాగా నటించింది. తను ఇప్పటివరకు చాలా విభిన్న పాత్రలు చేసింది. అందుకే ఈ 'బోళా శంకర్' లో సిస్టర్ క్యారెక్టర్ ఆమె చేస్తే బాగుంటుందని మేమంతా అనుకోవడం జరిగింది. ఇక షూటింగ్లో మా ఇద్దరి మధ్య ఎంతో మంచి బంధం ఏర్పడింది. అంతేకాదు కీర్తితో సీన్స్ చేస్తున్నప్పుడు నిజంగా సిస్టర్ లాంటి ఫీలింగ్ కలిగింది. మేము ఈ సినిమాలో ఆమె సిస్టర్ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తుందని ఊహించుకున్నామో అంతకు పదింతలు అద్భుతంగా నటించింది" అంటూ కీర్తి సురేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి.


ఆ తర్వాత తాను సెట్స్ లో ఎలా ఉంటారో వివరిస్తూ.. "మెహర్ రమేష్ ని బయట ఉన్నప్పుడు నా బ్రదర్ లాగా చూస్తాను. చూస్తున్నాను కూడా. కానీ సెట్స్ లోకి వెళ్లిన తర్వాత నో సెంటిమెంట్, నో రిలేషన్, నథింగ్.. సెట్స్ లో నేను చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. సెట్స్ లో ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా లాజిక్ అందకపోయినా, లేకపోతే నన్ను కన్విన్స్ గా మాట్లాడకపోయినా మాత్రం అక్కడే నిలదీసి అడుగుతాను. ఆ విషయం మెహర్ రమేష్ కి బాగా తెలుసు. అందుకే నేను సెట్ లోకి వస్తున్నాను అంటే వణికి పోయేవాడు. శీతాకాలంలోనూ చెమటలు పట్టేవి" అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. దీంతో మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Read : చిరంజీవి గురించి అడ్డగోలుగా మాట్లాడితే జైలుకు పంపించా, జీవిత రాజశేఖర్ దంపతులకు అల్లు అరవింద్ కౌంటర్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial