మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో 'ఖైదీ'(Khaidi) సినిమా ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ తన కెరీర్లో వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 'ఖైదీ' సూపర్ సక్సెస్ అవడంతో అవకాశాలు క్యూ కట్టాయి. అప్పట్లోనే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అలాంటి ఈ మూవీ రిలీజ్ అయి శనివారం (అక్టోబర్ 28) 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' మూవీని సంయుక్త మూవీస్ బ్యానర్ లో ఎం. తిరుపతిరెడ్డి, ధనంజయ రెడ్డి, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.


అప్పట్లోనే రూ.25 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.8 కోట్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పటికీ ఖైదీ రికార్డ్స్ ని మరే సినిమా బ్రేక్ చేయలేకపోయింది. పరుచూరి బ్రదర్స్ రచనా సహకారం అందించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన మాధవి, సుమలత హీరోయిన్స్ గా నటించగా చక్రవర్తి సంగీతం అందించారు. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రివేంజ్ డ్రామాలు వచ్చాయి. కానీ ఖైదీ మాత్రం అందుకు విభిన్నంగా తెరకెక్కింది. డైరెక్టర్ కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఈ చిత్రం. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం చిరంజీవి నటించిన 'ఖైదీ' సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది.






అలాంటి ఈ ప్రత్యేక చిత్రం విడుదలై అక్టోబర్ 28 తో 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు." ఖైదీ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ఖైదీని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒకసారి ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, ఆ చిత్ర దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్త మూవీస్ టీం ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత, మాధవిలని మొత్తం టీమ్ ని అభినందిస్తూ అంత గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని తెలిపారు.


దీంతో మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా 'ఖైదీ' తర్వాత మెగాస్టార్ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అవడంతో చిరంజీవి భారీ స్టార్ డమ్ అందుకున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు 'విజేత', 'స్వయంకృషి', 'రుద్రవీణ' వంటి సందేశాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలా ఇప్పటివరకు 155 సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ ప్రస్తుతం యువ హీరోలకు దీటుగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. తాజాగా యువ దర్శకుడు వశిష్ట తో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.


Also Read : వాళ్ల వల్లే నేను మునిగిపోయేలా ఉన్నానన్న అమర్ దీప్ - నేను ఉన్నా, లేకున్నా వాడ్ని ఫైనల్స్​లో చూడాలన్న శివాజీ!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial