• క్లైమాక్స్‌లో చిరంజీవి ఉండని చిరంజీవి సినిమా ‘విజేత’

  • చిరుకు రెండవ ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చిన సినిమా 

  • అల్లు అర్జున్, అల్లు బాబీ ఇద్దరూ కలిసి నటించిన సినిమా 

  • చిరంజీవి టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయిన విజేత 

  • 23 అక్టోబర్ 1985న రిలీజ్ అయిన విజేత


చిరంజీవి సినిమాల్లో ‘విజేత’ ఒక ప్రత్యేకమైన మూవీ. 1985లో విడుదలైన ఈ సినిమా క్లైమాక్స్ లో దాదాపు 15 నుంచి 20 నిముషాల సేపు చిరంజీవి ఉండరు. కనిపించినా ఎలాంటి డైలాగ్స్ ఉండవు . కథాంశం ప్రకారం హాస్పిటల్ లో బెడ్ పై ఉంటారంతే. క్లైమాక్స్ మొత్తం ప్రధాన పాత్ర దారులైన శారద, జేవీ సోమయాజులు, రంగ నాథ్, నూతన్ ప్రసాద్, శుభ, శ్రీలక్ష్మిల మధ్య నడుస్తుంది. కొన్ని సీన్లలో హీరోయిన్ భానుప్రియ, సత్యనారాయణ మాత్రం కనిపిస్తారు. ఇలాంటి సినిమాను చిరంజీవి ఎందుకు ఒప్పుకున్నారు? పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను ఎందుకు నిర్మించారు అంటే.. దానివెనుక చాలా ఇంట్రెస్టింగ్ అంశాలే ఉన్నాయి. 


ఖైదీ తర్వాత పూర్తి స్థాయి మాస్ హీరోగా మారిపోయిన చిరంజీవి


ఉండడానికి 1978 నుంచి సినిమాల్లో చేస్తూ వస్తున్నా.. చిరంజీవి కెరీర్ ను టర్న్ చేసిన సినిమా ‘ఖైదీ’. 1983లో వచ్చిన ఈ సినిమా చిరంజీవిని మాస్ లోకి బలంగా తీసుకుపోయింది. అంతకుముందు చిరు యాక్ట్ చేసిన సినిమాలు వేరు ఖైదీ తరువాత చిరంజీవి నటించిన సినిమాలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అన్నీ యాక్షన్ సినిమాలే.. అన్నీ పెద్ద బడ్జెట్ లే . గూండా, దేవాంతకుడు, ఛాలెంజ్, నాగు, అగ్నిగుండం, రుస్తుం, జ్వాల, పులి, రక్త సింధూరం ఇలా వరుసగా వస్తున్న మాస్ యాక్షన్ సినిమాలతో చిరు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కు తాను దూరం అవుతున్నానన్న ఫీలింగ్ చిరంజీవిలో మొదలైంది. మధ్యలో నటుడు సత్యనారాయణ నిర్మాతగా ‘చిరంజీవి’ అనే సెంటిమెంట్ సినిమా తీస్తే అది ప్లాప్ అయింది. దానితో ఎలాగైనా సరైన ఫ్యామిలీ సినిమా తీసి హిట్ కొట్టడమే కాకుండా మధ్యతరగతి ఫ్యామిలీ ప్రేక్షకుల లోకి వెళ్లాలని అనుకున్నారు చిరంజీవి. ఈ విషయాన్ని అల్లు అరవింద్‌కు చెప్పడంతో ఆయన కూడా చిరు నిర్ణయాన్ని బలపరిచారు. 


మొదలైన కథల వేట


మంచి ఫ్యామిలీ సినిమా కోసం వెతుకున్న చిరంజీవి బృందానికి అదే ఏడాది(1985) హిందీ లో అనిల్ కపూర్ హీరోగా వచ్చిన సాహెబ్ అనే సినిమా నచ్చింది. హిందీలో పెద్ద హిట్ గా నిలిచిన సాహెబ్ సినిమా నిజానికి అంతకు నాలుగేళ్ల (1981 ) ముందు వచ్చిన బెంగాలీ సినిమా (బెంగాలీ లోనూ అదే పేరు )కు రీమేక్. ఆ కథను తీసుకుని తెలుగు నేటివిటీ కి అనుగుణంగా మార్చుకుని చిరంజీవి హీరోగా తియ్యడానికి రెడీ అయ్యారు. అయితే పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా ఇమేజ్ పడిపోయిన తనతో ఫ్యామిలీ సినిమా అంటే అప్పటి పరిస్థితుల్లో ఇతర నిర్మాతలు వస్తారో లేదో అన్న అనుమానం చిరంజీవిలో ఉంది. పైగా అదే ఏడాదిలో వచ్చి ఫెయిలైన ట్రాజడీ సినిమా చిరంజీవి ఫలితం కళ్ళముందు కనపడుతుంది. దానితో సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ పైనే విజేత సినిమాను రూపొందించారు . 


టైటిల్ కోసం పత్రిక లో ప్రకటన


బెంగాలీ, హిందీల్లో టైటిల్ సాహెబ్ అని హీరో పాత్ర పేరు పెట్టారు. దాని ప్రకారం తెలుగులో హీరో పేరు చినబాబు కాబట్టి ఆ పేరే సినిమాకు పెడదాం అని ముందు అనుకున్నా ఒక నిర్ణయానికి రాలేక అప్పటి ప్రముఖ సినీ మ్యాగజైన్ జ్యోతి చిత్రలో పాఠకులనే  ఈసినిమాకు సజెస్ట్ చెయ్యమని కోరింది చిత్రబృందం, వారిలో ఎక్కువమంది విజేత పేరునే సూచించడంతో ఆ పేరే పెట్టారు. అలా ‘విజేత’ పేరును సూచించిన వారి పేర్లను డ్రా తీసి సినిమా టైటిల్ కార్డ్స్ లో వెయ్యడం విశేషం. హీరోయిన్ గా అప్పటికే సితారలాంటి సినిమాలతో ఒక్కసారిగా దూసుకొచ్చిన భానుప్రియను సెలెక్ట్ చేశారు. ఇక ఇప్పటి స్టార్ హీరో అల్లు అర్జున్ మూడేళ్ళ వయస్సులో శుభ కొడుకుగా రెండు సీన్లలో కనపడితే.. తన అన్నయ్య ప్రస్తుత నిర్మాత అల్లు బాబీ కూడా నూతన్ ప్రసాద్ కొడుకుగా కొన్ని సీన్లలో కనపడడం విశేషం. 


కథాంశం


ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. చిరంజీవి ఒక మధ్యతరగతి కుటుంబంలోని అన్నదమ్ముల్లో చిన్నవాడు. ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆడాలనేది తన కోరిక. అయితే తండ్రి తనను అపార్ధం చేసుకుంటూ ఉంటాడు. పెద్ద వదిన శారద తప్ప మిగిలిన ఇద్దరు వదినలు తమ స్వార్ధం కోసం చినబాబును వాడుకొంటూ పెద్దగా విలువ ఇవ్వరు . చివరకు అందరికంటే ఆఖరి చెల్లి పెళ్ళికి డబ్బు ఇవ్వడానికి ఆమె అన్నయ్యలు, వదినలు ఒప్పుకోకపోయేసరికి ఇంటిని అమ్మెయ్యాలనుకుంటాడు చినబాబు తండ్రి. ఇంటిని కాపాడడానికి.. చెల్లిపెళ్లి సకాలంలో చెయ్యడానికి వీలుగా తన కిడ్నీని అవసరంలో ఉన్న ఒక ధనవంతుడి కొడుకు కోసం ఇచ్చేస్తాడు చినబాబు. ఆ డబ్బును దూరంగా ఉంటున్న పెద్దక్క పంపింది అని అబద్దం చెప్పి.. మ్యాచ్ కోసం ఊరు వెళుతున్నానంటూ  హాస్పిటల్ కు వెళ్లి హాస్పిటల్ లో చేరుతాడు. చివరికి పెళ్లి అయిపోయాక వచ్చిన పెద్దక్క తానా డబ్బు పంపలేదని చెప్పడంతో అందరూ చినబాబు ఏదో తప్పుడు మార్గంలో ఆ డబ్బు తెచ్చాడనుకుని అనుమానం వ్యక్తం చేస్తారు అతని చిన్న వదినలు అన్నయ్యలు. ఈలోపు నిజం తెలుసుకున్న పెద్ద వదిన శారద మిగిలిన కుటుంబ సభ్యులకు బుద్ది చెబుతుంది . ఇదంతా విన్న చినబాబు తండ్రి అతని త్యాగాన్ని, మంచి మనసును అర్ధం చేసుకుని హాస్పిటల్ కు వెళ్లి చినబాబును చూస్తారు. అన్నయ్యల్లోనూ మార్పు వస్తుంది. చినబాబు ఆపరేషన్ పూర్తి చేసుకుని క్షేమంగా బయటకు రావడంతో సినిమా పూర్తవుతుంది . 


సినిమా క్లైమాక్స్ లో పావుగంట సేపు కనపడని చిరంజీవి


ఈ  సినిమాలో స్క్రీన్ ప్లే పరంగా చినబాబు హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి.. ఆయనకు డైలాగ్స్ ఉండవు . మత్తులో హాస్పిటల్ బెడ్ పైనే ఉంటారు. కానీ ఇంటిదగ్గర పెళ్లి అనంతరం కుటుంబసభ్యులు చినబాబుపై అపోహ పడడం.. అనంతరం శారద నిజం తెలుసుకుని మిగిలినవాళ్లకు క్లాస్ పీకడం.. అది విని చినబాబు తండ్రి సోమయాజులు, శారద మధ్య ఎమోషనల్ డైలాగ్స్... ఇలా ఆ సీన్ అంతా పావుగంట పైనే నడుస్తుంది. నిజానికి అదే క్లైమాక్స్. తరువాత ఎండ్ కార్డు కోసం చిరంజీవితో ఒక డైలాగ్ అనిపించినప్పటికీ అంతకుముందు అసలు చిరులాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో లేకుండా క్లైమాక్స్ ని నడపడం అంటే మాటలు కాదు. భేషజాలకు పోకుండా అలాంటి క్లైమాక్స్ కు  ఒప్పుకోవడమే చిరంజీవిని సినీ రంగంలో అసలైన ‘విజేత’గా నిలబెట్టిందని అంటారు ఆయన అభిమానులు. ఆ క్లైమాక్స్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఎమోషనల్ గా నడిపించిన దర్శకుడు కోదండ రామిరెడ్డి డైరెక్షన్,సెంటిమెంట్ తో నే హీరోకి ఎలివేషన్ ఇచ్చే జంధ్యాల డైలాగ్స్ శారద, సోమయాజుల నటన.. ఆ సీన్లో హీరో లేదు అనే విషయాన్నీ ప్రేక్షకులకు గుర్తురాకుండా నడిపిస్తాయి . 


ఇతర భాషల్లో రీమేక్ అయిన  విజేత


సెంటిమెంట్ తో కూడిన హీరోయిజంతో కొత్త రకం ట్రీట్మెంట్ తో రిలీజైన ‘విజేత’ సినిమా ఇతర దక్షణాది భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది. వారంతా ఒరిజినల్ వెర్షన్ల కంటే తెలుగు వెర్షన్ సినిమానే రీమేక్ చేశారు. తమిళంలోకి ‘ధర్మ ప్రభు’ అనే పేరుతొ చిరంజీవి సినిమానే డబ్ చేశారు. కన్నడలో విష్ణు వర్ధన్ హీరోగా ‘కర్ణ’ పేరుతొ, 1986లో ‘చెక్కఱేన్ ఒరు చిల్లా’ పేరుతొ శంకర్ హీరోగా మలయాళంలో రీమేక్ అయింది తెలుగు విజేత. ఈ సినిమా రెండు కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దానితో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా హిట్ ఇవ్వాలని అనుకున్న చిరంజీవి కోరిక కూడా హిట్ అయింది.


Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు


Also Read: చిరంజీవి బాలీవుడ్ చిత్రాలివే, ఆ సినిమా తర్వాత ఉత్తరాదికి ఎందుకు దూరమయ్యారు?