Ahmed Khan About Sridevi: అలనాటి నటి శ్రీదేవికి చాలావరకు సినీ సెలబ్రిటీలతో మంచి సాన్నిహిత్యం ఉండేది. సౌత్‌లో మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో కూడా తన యాక్టింగ్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తనతో కలిసి పనిచేసిన చాలామంది.. శ్రీదేవి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి ఒక స్టార్ కొరియోగ్రాఫర్ యాడ్ అయ్యారు. బాలీవుడ్‌లో తన స్టైల్ డ్యాన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అహ్మద్ ఖాన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అహ్మద్ ఖాన్.. ‘మిస్టర్ ఇండియా’ సినిమా సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. దానివల్లే వారిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారని బయటపెట్టారు.


అలా ఫ్రెండ్‌షిప్ మొదలయ్యింది..


‘‘మేము మిస్టర్ ఇండియా షూటింగ్‌లో ఉన్నాం. అప్పుడు ఒక హాస్పిటల్ సీన్ షూటింగ్ జరుగుతోంది. దాని తర్వాతే ఒక బాంబ్ బ్లాస్ట్ సీన్ చేయాలి. ఆ బాంబ్ బ్లాస్ట్ సీన్ తర్వాత ఒక పాత్ర చనిపోతుంది. అది చాలా సీరియస్ సీన్. అప్పుడే శ్రీదేవి మమ్మల్ని డైరెక్టర్ రూమ్‌లోకి తీసుకెళ్లి మాకు ఐస్ క్రీమ్ ఇచ్చింది. మీరు నాకు నచ్చారని ఇది ఇవ్వడం లేదు, మీరు నాకు బ్రేక్ డ్యాన్స్ నేర్పించాలని ఇస్తున్నాను అని చెప్పింది. కాబట్టి మేము తనకు కొన్ని స్టెప్స్ నేర్పించాం. అలా మా ఫ్రెండ్‌షిప్ మొదలయ్యింది’’ అని తెలిపారు అహ్మద్ ఖాన్. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా శ్రీదేవి.. సెట్‌లో ప్రతీ ఒక్కరితో బాగుండేది ఇది మరొక ఉదాహరణ అని తన ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


మైఖెల్ జాక్సన్ లాగా..


ఇది మాత్రమే కాకుండా శ్రీదేవిపై తన అభిప్రాయాన్ని కూడా చెప్పుకొచ్చారు అహ్మద్ ఖాన్. ‘‘చాలామందికి తెలిసినట్టు శ్రీదేవి చాలా రిజర్వ్‌డ్ ఉండేది. ఆఫ్ కెమెరా ఆమె రిజర్వ్‌డ్ ఉండేది. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ చేసిన తర్వాత తను మిస్టర్ ఇండియా సినిమాలో సీమా పాత్రలోకి మారిపోయేది. ఒక్కసారి దర్శకుడు కట్ చెప్పగానే చిటికెలో మళ్లీ ఆ పాత్ర నుండి బయటికి వచ్చేది. అది చూస్తుంటే నాకు మైఖెల్ జాక్సన్ గుర్తొచ్చేవారు. ఆయన కూడా మెల్లగా మాట్లాడుతూ స్టేజ్ ఎక్కగానే ఒక్కసారిగా విధ్వంసం సృష్టించేవారు. అసలు శ్రీదేవికి అలా ఎలా సాధ్యమని మేము ఆశ్చర్యపోయేవాళ్లం. తను చాలా గ్రేట్. తను మొదట్లో మాతో ఫ్రెండ్లీగా ఉండేది కాదు కానీ మెల్లగా అది మారింది’’ అని గుర్తుచేసుకున్నారు అహ్మద్ ఖాన్.


బాలీవుడ్ క్లాసిక్..


శ్రీదేవి కెరీర్‌ మొదట్లోనే ఎన్నో గుర్తుండిపోయే సినిమాల్లో నటించారు. అందులో ‘మిస్టర్ ఇండియా’ కూడా ఒకటి. 1987లో విడుదలయిన ఈ మూవీలో శ్రీదేవి డిఫరెంట్ గెటప్‌లో కనిపించి అందరినీ అలరించారు. ఇప్పటికీ ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవి అంటే చాలామందికి ఇష్టం. శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. బాలీవుడ్ క్లాసిక్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. రూ.3.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఆరోజుల్లోనే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో శ్రీదేవికి జోడీగా అనిల్ కపూర్ నటించారు. ఇద్దరి కెరీర్‌లో ‘మిస్టర్ ఇండియా’ అనేది గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది.



Also Read: వెన్నులో వణుకు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ - తమన్నా సడన్ సర్‌ప్రైజ్, టీజర్ వచ్చేసింది చూశారా?