బాలీవుడ్ దర్శకుడు టీనూ ఆనంద్ అప్పట్లో నటి మాధురి దీక్షిత్ లో జరిగిన గొడవ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సుమారు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. అమితాబచ్చన్ తో తాను తెరకెక్కించాల్సిన మూవీ మాధురి దీక్షిత్ కారణంగానే ఆగిపోయిందని అన్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా మాధురి దీక్షిత్ తో గొడవ జరగడంతో టీనూ ఆనంద్ ఆ సినిమాని నిలిపివేశారు. కేవలం ఐదు రోజుల షూటింగ్ తోనే ఆ మూవీ అటకెక్కింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు ఏం జరిగింది?


బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్, మాధురి దీక్షిత్ జంటగా 1989లో ఓ సినిమా అనుకున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో అదే మొదటి చిత్రం దాంతో ఈ మూవీపై అప్పట్లో అందరికీ ఎంతో ఆసక్తి ఉండేది. టీనూ ఆనంద్ ఈ మూవీకి డైరెక్టర్. షూటింగ్ కూడా మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్లో ఐదు రోజుల షూటింగ్ జరిగిందట. ఇక ఇదే సంఘటన గురించి టీనూ ఆనంద్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." సినిమాలోని ఓ సీక్వెన్స్ లో అమితాబచ్చన్ ని కొంతమంది రౌడీలు బంధిస్తారు. రౌడీల నుంచి హీరోయిన్ కాపాడేందుకు అమితాబ్ ఎంతో శ్రమిస్తారు. ఈ క్రమంలోనే తనని రక్షించిన హీరోకి కృతజ్ఞత తెలుపుతూ హీరోతో అన్ని విధాలుగా దగ్గర అవ్వాలని హీరోయిన్ అనుకుంటుంది. ఇందులో భాగంగానే సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశాల్లో హీరోయిన్ లో దుస్తులతో చూపించాలని అనుకున్నా. ఇదే విషయాన్ని మాధురి దీక్షిత్ కు చెప్పా. మొదట్లో ఆమె ఓకే చెప్పింది. తీరా షూటింగ్ రోజు నటించేందుకు ఓకే చెప్పలేదు. దాంతో ఆమెకు నాకు గొడవ జరిగింది. ఆ సీన్ చేయకపోతే సెట్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పా. ఆ మాటకు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది" అని తెలిపారు టీనూ ఆనంద్.


అప్పట్లో బాలీవుడ్ క్వీన్స్ లో ఒకరిగా మాధురి దీక్షిత్ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. శ్రీదేవికి సమానంగా బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. నటనతో పాటు తన అందం, డాన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికీ మాధురి దీక్షిత్ ని ఆరాధించే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక టీనూ ఆనంద్ విషయానికొస్తే.. చాలామందికి ఈ దర్శకుడి పేరు తెలియకపోవచ్చు. కానీ మన తెలుగులో ఈయన చాలా సినిమాల్లో నటించారు.


బాలకృష్ణ 'ఆదిత్య 369' సినిమాతో నటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అందులో కాలంలో ప్రయాణించే టైం మిషన్ ని చేసే శాస్త్రవేత్త పాత్రను పోషించాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అంజి' మూవీలో విలన్ గా మెప్పించాడు. ఇక ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాలో కూడా నటించారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' మూవీలోనూ టీనూ ఆనంద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 'సలార్' టీజర్ లో ప్రభాస్ క్యారెక్టర్ ని పరిచయం చేసింది ఆయనే. టీజర్ లో ప్రభాస్ క్యారెక్టర్ ని టీనూ ఆనంద్ ఎలివేట్ చేసిన తీరు ఫాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.


Also Read : ఎట్టకేలకు గోపీచంద్ 'రామబాణం' మూవీకి మోక్షం - త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా







Join Us on Telegram: https://t.me/abpdesamofficial