సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ ‘యానిమల్’లోని రణబీర్ పాత్ర గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారో.. విలన్‌గా చేసిన బాబీ డియోల్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. ఇక మూవీ రిలీజ్ తర్వాత మొదటిసారిగా ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ.. సినిమా గురించి, దర్శకుడి గురించి, సహా నటుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అంతే కాకుండా తన తల్లి సినిమా క్లైమాక్స్‌లో ఏడ్చేసిందని బయటపెట్టాడు బాబీ. ‘యానిమల్’లో అబ్రార్ హక్ పాత్రలో కనిపించిన బాబీ.. ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు.


టీజర్‌లో నేను లేనా..?
‘‘యానిమల్‌కు సంబంధించిన ప్రతీ అంశం అద్భుతంగా ఉంటుందని నాకు తెలుసు. టీజర్ విడుదలయినప్పుడు సందీప్ వచ్చి.. ‘‘నీకొక సర్‌ప్రైజ్ ఉంది. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు’’ అని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. ఆ సమయంలో నేను అలీబాగ్ దగ్గర్లో షూటింగ్‌లో ఉన్నాను. అక్కడ నెట్‌వర్క్ సరిగా లేదు. ‘యానిమల్’ టీజర్ చూద్దామంటే అది బఫర్ అవుతూనే ఉంది. ఫైనల్‌గా చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది అనుకున్నాను అంతే’’ అంటూ టీజర్ చూసినప్పుడు తన ఫీలింగ్‌ను బయటపెట్టాడు బాబీ.


అంతే కాకుండా ముందుగా టీజర్ చూసినప్పుడు తాను లేనని ఆశ్చర్యపోయాడట. ‘‘టీజర్‌లో రణబీర్ అద్భుతంగా ఉన్నాడు. అనిల్ కపూర్ అద్భుతంగా ఉన్నాడు. అందరూ ఉన్నారు. నేనెక్కడ ఉన్నాను? ‘యానిమల్’ అని టైటిల్ కూడా వచ్చేసింది. ఇదేనా సర్‌ప్రైజ్ అంటే అనుకున్నాను. కానీ అక్కడ తను నా షాట్ పెట్టాడు. షూటింగ్ లొకేషన్ నుంచి కార్ ఎక్కిన తర్వాత నాకు నెట్‌వర్క్ వచ్చింది. అప్పటికప్పుడు నాకు ఎన్నో కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. అప్పుడే నాకు సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయ్యిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక ట్రైలర్‌లో కూడా నా పాత్రను చూపించిన విధానం వల్ల నాకు మరిన్ని ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయి’’ అని బాబీ బయటపెట్టాడు. 


జీవితాన్ని మార్చేశాడు..
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు బాబీ. ‘‘సందీప్ రెడ్డి వంగా నా జీవితాన్ని మార్చేశాడు. ఈ మాట నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రేక్షకులు నన్ను యాక్టర్‌గా చూస్తున్న విధానం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు నాకు అవకాశాలు వస్తే ప్రపంచాన్ని ఏలేస్తాను అని అనిపిస్తోంది. నేను ఎప్పటికీ తనకు రుణపడి ఉంటాను. నేను తనతో మళ్లీ మళ్లీ పనిచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. కానీ తను ఇప్పుడు ఇంకెదో ప్లాన్ చేస్తున్నాడు’’ అని అన్నాడు.


‘యానిమల్’ డ్యూరేషన్ గురించి కూడా బాబీ మాట్లాడాడు. ‘‘సందీప్ పనితీరు అలాంటిది. అందుకే 3 గంటల 21 నిమిషాలు ఉన్న సినిమాను కూడా మళ్లీ మళ్లీ చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. నేను సినిమాను రెండుసార్లు చూశాను అంటూ వచ్చి నాతోనే చెప్తున్నవాళ్లు ఉన్నారు. రోడ్డుపై వెళ్తుంటే నాతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది. సినిమా ఇంత హిట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 


నాన్న, అన్నయ్య సినిమా చూడలేదు..
తన కుటుంబంతా ‘యానిమల్’ చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారో కూడా బాబీ చెప్పుకొచ్చాడు. ‘‘వారు బయట నుంచి సినిమా స్పందన వినడంతో చాలా సంతోషంగా ఉన్నారు. నాన్న, అన్నయ్య ఇంకా సినిమాను చూడలేదు. కానీ అమ్మ క్లైమాక్స్‌ను చూడలేకపోయింది. నేను చనిపోతాను అని తెలిసినప్పటి నుంచే ఏడవడం మొదలుపెట్టింది. కానీ తనకు సినిమా చాలా నచ్చింది. అమ్మ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు నన్ను కలవాలని అనుకుంటున్నారు. ‘ఆశ్రం’లో నటించినప్పుడు కూడా అందరూ నన్ను కలవాలని అనుకున్నారు. మళ్లీ ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. కానీ ఈసారి చాలా డిఫరెంట్‌గా ఉంది. నా భార్య, కొడుకులకు కూడా సినిమా నచ్చింది. అందరూ నేను సినిమాలో మరికాసేపు ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు’’ అని బాబీ తెలిపాడు.


Also Read: ‘యానిమల్’లో పెళ్లిలో రేప్ సీన్‌పై బాబీ డియోల్ రీల్ భార్య స్పందన - ఆయన ఉద్దేశం అది కాదు