టాలీవుడ్ లో సమ్మర్ సినిమాల సందడి కొనసాగుతోంది. ప్రతి వారం ఓ క్రేజీ మూవీ థియేటర్లలో విడుదల అవుతోంది. మరోవైపు రాబోయే మంచి సీజన్స్ కోసం పోటీ తీవ్రంగా నడుస్తోంది. మేకర్స్ అందరూ ఇప్పటి నుంచే రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. కొందరు వినాయక చవితి, దసరా, దీపావళి సీజన్స్ పై ఫోకస్ పెడితే.. మరికొందరు మాత్రం అంతకంటే ముందు వచ్చే ఇండిపెండెన్స్ వీక్ మీద దృష్టి సారిస్తున్నారు. 

 

స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ అందరూ ఇప్పుడు ఆగస్ట్ 11వ తేదీన తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 5 రోజుల లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడు క్రేజీ చిత్రాల విడుదలలను అధికారికంగా ప్రకటించారు. మరో సినిమా ఛాన్స్ దొరికితే అదే డేట్ కి రావాలని చూస్తోంది. ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం!

భోళా శంకర్:


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇది తమిళ్ లో ఘన విజయం సాధించిన వేదాళమ్ సినిమాకు అధికారిక రీమేక్. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ చిత్రాన్ని 2023 ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 

డీజే టిల్లు 2:


సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. ఇది బ్లాక్ బస్టర్ 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ముందుగా SSMB28 సినిమాని ఆగస్ట్ 11న రిలీజ్ చెయ్యాలని భావించిన సితార టీమ్.. కుదరకపోవడంతో ఇప్పుడు ఆ డేట్ కి 'డీజే టిల్లు 2' ని తీసుకురావాలని అనుకుంటున్నారట. ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించలేదు కానీ.. అదే తేదీని టార్గెట్ గా పెట్టుకొని షూటింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

యానిమల్:


'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ హిందీ మూవీ 'యానిమల్'. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు అప్పుడెప్పుడో ప్రకటించారు. సందీప్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని రణబీర్ 'బ్రహ్మాస్త్రం' మాదిరిగానే ఈ యాక్షన్ మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉంది. హీరోయిన్ రష్మీక మందన్నా అదనపు అడ్వాంటేజ్ అని చెప్పాలి.

మహావీరుడు:


కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'మావీరన్'. తెలుగులో 'మహావీరుడు' అనే పేరుతో రూపొందిస్తున్నారు. ఇందులో సునీల్ ఓ పాత్ర పోషిస్తున్నారు. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. 

 

ఇలా నాలుగు సినిమాలు ఒకే రోజున థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఐదు రోజుల వీకెండ్ కాబట్టి ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. సాధారణంగా సంక్రాంతి, దసరా పండుగలకు ఇలాంటి బాక్సాఫీస్ క్లాష్ ను చూస్తుంటాం. కానీ ఈసారి ఎవరి వారు ఇండిపెండెన్స్ డేని టార్గెట్ గా పెట్టుకొని ముందుకి సాగుతుండటం ఆసక్తికరం. మరి రానున్న రోజుల్లో విడుదల తేదీలలో ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి.