‘బిగ్ బాస్’ సన్నీ పార్టీ పెట్టబోతున్నా అంటూ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాజాగా ఆ పార్టీ పేరును రివీల్ చేశాడు. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ.. తాను పార్టీ పెడుతున్నా అని తెలియగానే కొందరు రాజకీయ పార్టీ నేతలు కాల్ చేసి అభినందించారని తెలిపారు. ఏపీ, తెలంగాణ సీఎంలే కాదు, ప్రధాని మోడీ కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారని పేర్కొన్నాడు. అంటే, సినిమాల్లో ఎలాగో క్లిక్ అవ్వలేదని, సన్నీ రాజకీయ బాట పట్టాడా అనుకుంటున్నారా? కానే కాదు.. ఇదంతా, తన కొత్త సినిమా కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్. బుధవారం తన మూవీ టైటిల్ రిలీజ్ సందర్భంగా అసలు విషయాన్ని చెప్పాడు. ఇంతకీ అతడి సినిమా టైటిల్ ఏమిటో తెలుసా?


బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు వీజే సన్నీ. ‘బిగ్ బాస్’ సీజన్ 5లో అతను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. పాపులర్ యూట్యూబ్ షణ్ముఖ్‌ని సైతం వెనక్కి నెట్టి ట్రోపీ అందుకున్నాడు. ఇక బిగ్ బాస్ షోతో ఫుల్ లైమ్ లైట్ లోకి వచ్చిన సన్నీకి వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టడం మొదలెట్ట్టాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా 'అన్ స్టాపబుల్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. వీజే సన్నీ నటిస్తున్న కొత్త సినిమా పేరు 'సౌండ్ పార్టీ'. బుధవారం ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేశారు. సినీ జర్నలిస్టుల సమక్షంలో ఈ మూవీ లోగోని లాంచ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాతో సంజయ్ శేరి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అలాగే డైరెక్టర్ జయశంకర్ ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.


ఫుల్ మూన్ మీడియా పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో సన్నీ సరసన హ్రితికా శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మూవీ లోగో ఆవిష్కరణ సందర్భంగా హీరో వీజే సన్నీ మాట్లాడుతూ.. "నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు చాలామంది నుంచి ఫోన్స్ వచ్చాయి. నేను రాజకీయ పార్టీ పెట్టబోతున్నా అని చాలామంది రాజకీయ నాయకులు ఫోన్ చేశారు. ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీల పెద్దలు, చివరికి మోదీ, అమెరికా అధ్యక్షుడి నుంచి కూడా అభినందనలు అందాయి. ఆ పార్టీ ఏంటో ఇప్పుడు మీడియా మిత్రుల సమక్షంలో రివీల్ చేయడం ఆనందంగా ఉంది. అది రాజకీయ పార్టీ కాదు. మా కొత్త సినిమా టైటిల్ 'సౌండ్ పార్టీ'. ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా మిత్రుల చేత మీదుగా మా సినిమా టైటిల్ లోగో లాంచ్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా నిర్మాత అమెరికాలో ఉంటూ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా పూర్తి చేయడానికి సహకరించారు. మా దర్శకుడు సంజయ్ ఎక్కడా తడబడకుండా ఈ సినిమా తీశారు. జయశంకర్ కూడా అన్ని తానే సినిమాని నడిపించారు. కచ్చితంగా 'సౌండ్ పార్టీ' థియేటర్స్లో గట్టిగా సౌండ్ చేస్తుంది అని నమ్ముతున్నా" అని అన్నారు వీజే సన్నీ.


ఇక ఆ తర్వాత దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ.. "ఈ సినిమా మొదలై గుమ్మడికాయ కొట్టడం వరకు వచ్చిందంటే అది కేవలం నా మిత్రుడు జయశంకర్ వల్లే. తను లేకుంటే ఈ సినిమా లేదు. సన్నీ తో పాటు కాస్ట్ అండ్ క్రూ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఇదొక ఫుల్ ఫన్ రైడ్ లాంటి మూవీ. ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ ని ప్లాన్ చేశాం" అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వి, మిర్చి ప్రియా, శివన్నారాయణ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, జెమినీ సురేష్, చలాకి చంటి, ఐ డ్రీమ్ అంజలి, హేమా సాగర్, ఆర్జే హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు  మోహిత్ రెహమానిక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాసరెడ్డి ఫోటోగ్రఫీ అందిస్తుండగా, జి అవినాష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. మరి 'సౌండ్ పార్టీ' మూవీపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న వీజే సన్నీ కి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.


Also Read: 'భారతీయుడు 2' అవుట్ ఫుట్ పై కమల్ ధీమా - దర్శకుడు శంకర్‌కు కాస్ట్లీ గిఫ్ట్, ధర ఎంతో తెలుసా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial