లయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ కి సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మలయాళం తర్వాత ఈ హీరోకి తెలుగులో భారీ పాపులారిటీ ఉంది. గత ఏడాది విడుదలైన 'సీతారామం' సినిమాలో తన అద్భుతమైన నటనతో  తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు ఈ యంగ్ హీరో. బాక్సాఫీస్ వద్ద 'సీతారామం' ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ మూవీస్ చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. 'సీతారామం' లో తన క్లాస్ నటనతో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు మాస్ మూవీతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్ ఆఫ్ కోథా'. జి స్టూడియోస్ సంస్థతో కలిసి దుల్కర్ సల్మాన్ తన ప్రొడక్షన్ హౌస్ వెపేరియర్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


తెలుగులో ఈ మూవీ టీజర్ ని టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు రిలీజ్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక తాజాగా విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. టీజర్ లో దుల్కర్ సల్మాన్ మాఫియా కింగ్ ఆఫ్ కోథా కు నాయకుడిగా కనిపించాడు. ఇక టీజర్ ని పరిశీలిస్తే.. "రాజు గారి రాకకోసం ప్రజలు వేచి ఉన్నారు. వారి ప్రజలను చంపి తిన్న ఆ రాక్షసుడు నుంచి ఈ దేశాన్ని రక్షించడం రాజు గారి వల్లే వీలు అవుతుందని వాళ్లు నమ్మారు. ఆఖరికి ఆ రోజు వచ్చేసింది. రాజుగారు తిరిగి వచ్చేశారు" అని ఐశ్వర్య లక్ష్మి చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. కోథా అనే గ్రామంలో విలన్ చేతిలో బానిసలుగా పడి ఉన్న ప్రజల్ని కాపాడ్డానికి రాజుగా కింగ్ ఆఫ్ కోథాగా దుల్కర్ సల్మాన్ అడుగుపెడతాడు. ఇక టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తోనే నింపేశారు. "ఇది గాంధీ గ్రామం కాదు.. కోథారా, ఇక్కడ నేను అన్నప్పుడే పగలు, నేను అన్నప్పుడే రాత్రి" అని టీజర్ లో దుల్కర్ చెప్పే డైలాగ్ అయితే హైలెట్ గా నిలిచింది.


టీజర్ లో దుల్కర్ ని చూస్తుంటే మాఫియా లీడర్ గా తన నట విశ్వరూపాన్ని చూపించాడని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీజర్ లో దుల్కర్ ఫేస్ ను రివిల్ చేసే షాట్స్ అయితే అదిరిపోయాయి. అంతేకాదు టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. ఇక టీజర్ చివర్లో రక్తంతో తడిసిన ముఖం చేతిలో కత్తితో దుల్కర్ సల్మాన్ విలన్స్ ను వేటాడుతున్న సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై విపరీతమైన హైప్ పెంచేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. జేక్స్ బీజాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 1980 - 90 ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మలయాళం తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా 'కింగ్ ఆఫ్ కోట్థా' టీజర్ చూస్తుంటే 'కే జి ఎఫ్' వైబ్స్ గుర్తుకొస్తున్నాయి. మరి ఆ రేంజ్ లో ఈ మూవీ దుల్కర్ సల్మాన్ కి పాన్ ఇండియా సక్సెస్ ని అందిస్తుందేమో చూడాలి.