Amitabh Bachchan - Ram Gopal Varma: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకూ ఆరు చిత్రాలు తెరకెక్కగా.. సినిమాలకు అతీతంగా వీరి మధ్య బాండింగ్ కొనసాగుతోంది. అయితే చాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో సందడి చేశారు. బిగ్ బీ హైదరాబాద్ లోని తన డెన్ కు వచ్చినట్లు పేర్కొంటూ, ఆర్జీవీ బుధవారం కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆక‌స్మికంగా ఇద్దరు దిగ్గజ దర్శక నటులు కలిసి మంతనాలు సాగించ‌డంలై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వచ్చాయి. దీనిపై తాజాగా అమితాబ్ క్లారిటీ ఇచ్చారు.


ఆర్జీవీ - అమితాబ్ కలిసిన తర్వాత.. ఈ కాంబోలో మరో ప్రాజెక్ట్ రాబోతోందనే రూమర్స్ మొదలయ్యాయి. 'సర్కార్ 4' గురించి చర్చలు జరిపారేమో అని నెటిజన్లు కామెంట్లు చేశారు. వర్మ తన పోస్ట్ లో 'వ్యూహమింగ్' అని మెన్సన్ చేయటంతో 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్ లో బిగ్ బీ భాగం అవుతారన్న ప్రచారం కూడా మొదలైంది. వీరిద్దరి కలయికపై అనేక డిబేట్లు జరుగుతున్న తరుణంలో, షూటింగ్ కోసమో హైదరాబాద్ వచ్చినట్లు అమితాబ్ బచ్చన్ బ్లాగ్ లో రాసుకొచ్చారు. ఆర్జీవీ డెన్ ను విజిట్ చేయటం గురించి చెబుతూ.. వర్మతో సినిమా కంటెంట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చించినట్లు తెలియారు.


"హైదరాబాద్ సిటీలో చివరి రోజు పని చేసిన తర్వాత జీనియస్, మిస్టీరియస్, రహస్యమైన ఆలోచనలు కలిసిన రామ్ గోపాల్ వర్మ అలియాస్ రామును సందర్శించడం జరిగింది. అతను ఫిలిం కంటెంట్ పై నాన్-స్టాప్ గా మాట్లాడారు. AIతో మనం ఎక్కడికి వెళ్తున్నాము? దాని వల్ల జరిగే విప్లవాత్మక మార్పుల గురించి నిశితంగా మాట్లాడుకున్నాం" అని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.


అమితాబ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్‌, దీపికా పదుకొణె హీరో హీరోయిన్లుగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ‘కల్కి 2898 AD’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు తలైవర్ రజనీకాంత్‌ హీరోగా టి.జె.జ్ఞానవేల్‌ రూపొందిస్తోన్న ‘వేట్టయాన్‌’ సినిమాలోనూ బిగ్ బీ నటిస్తున్నారు. ఇప్పుడు మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా.. దీని కోసమే ఆయన సిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్జీవీ ఆహ్వానం మేరకు అతని డెన్ ను విజిట్ చేసినట్లుగా సమాచారం.


ఏదేమైనా 'సర్కార్' దర్శక నటులు రామ్ గోపాల్ వర్మ - అమితాబ్ బచ్చన్ కలయిక నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఆర్జీవీ డెన్ లో వారు ఏం మాట్లాడుకున్నారు.. ఎందుకు మీట్ అయ్యారనేది పక్కన పెడితే, ఇదంతా 'వ్యూహం' సినిమా ప్రచారానికి ఉపయోగపడింది. ఏదైనా తన ప్రమోషన్ కోసమే చేస్తానని చెప్పే వర్మ.. అమితాబ్ తో కలిసి దిగిన ఎక్స్ లో పోస్ట్ చేసి తన సినిమా గురించి చర్చలు జరిగేలా చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేప‌థ్యంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ 'వ్యూహం' మార్చి 2వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలకు అనేక అడ్డంకులు ఎదురవ్వగా.. పట్టువదలని విక్రమార్కుడిగా ఆర్జీవీ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ తెచ్చుకొని సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. దీని తర్వాత రెండో భాగం 'శపథం' మూవీ రిలీజ్ కాబోతోంది.


Also Read: మనశ్శాంతి లేదు.. ఎటైనా వెళ్లిపోవాలని ఉంది - స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!