కరోనా మహమ్మారి వలన ప్రపంచ దేశాలు ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాయో చూశాం. కరోనా సమయంలో నిత్యం లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను విధిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా కరోనా వలన 2020 మార్చి 22 న ‘జనతా కర్ఫ్యూ’ విధించింది ప్రభుత్వం ఆ తర్వాత నేరుగా సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేశారు. దీంతో దేశం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు తమ సొంత ఊర్లకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలో ఎంతో మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఆనాటి పరిస్థితులు గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. అయితే భారత దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితులను చూపిస్తూ ఓ సినిమాను రూపొందించారు. అదే ‘భీడ్’(BHEED). రాజ్ కుమార్ రావు హీరోగా అభినవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీను మార్చి 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


ఇక ట్రైలర్ విషయానికొస్తే.. రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ను మూవీ నిర్మాణ సంస్థ టి-సిరీస్ విడుదల చేసింది. ట్రైలర్ లో ప్రధానంగా కరోనా లాక్ డౌన్ సమయంలో వసల కార్మికుల పరిస్థితులను కళ్లకుకట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటనతో ట్రైలర్ మొదలవుతుంది. వేలాది మంది వలస కార్మికులు తమ సొంతఊర్లకు వెళ్లడానికి బయలుదేరినపుడు వారిని అడ్డుకోవడం కోసం పోలీసులు వారిని కొట్టడం, కెమికల్ వాటర్ ను చల్లడం వంటి అంశాలను చూపించారు. ఇందులో రాజ్ కుమార్ రావు ఓ నిజాయితీ గల పోలీస్ అధికారిగా కనిపించారు. ట్రైలర్ లో రాజ్ కుమార్ ‘న్యాయం ఎప్పుడూ శక్తివంతుల చేతుల్లోనే ఉంటుంది, పేదవారికి చేసే న్యాయం వేరుగా ఉంటుంది’’ అనే డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. అలాగే మూవీలో కృతికా కామ్రా జర్నలిస్ట్ గా కనిపించింది. ఆమె ఈ లాక్ డౌన్ పరిస్థితిను భారత్ లో జరిగిన 1947 విభజనతో పోల్చుతుంది.


అలాగే ట్రైలర్ లో కరోనా సమయంలో కుల మత బేధాలు కూడా ఎలా ప్రభావం చూపాయో చూపించారు. తబ్లిఘి జమాత్ తర్వాత అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయనే పుకార్ల మధ్య పంకజ్ కపూర్ తన బస్సులోని పిల్లలను ముస్లిం పురుషులు ఇచ్చే ఆహారాన్ని తిననివ్వకపోవడం వంటి సన్నివేశాలు కూడా ఇందులో కనిపించాయి. తర్వాత ‘‘నువ్వు హీరో కావాలనుకుంటున్నావా?’’ అని అశుతోష్ రానా రాజ్‌ కుమార్‌ ను చెంపదెబ్బ కొడతాడు. దీంతో ఉద్వేగానికి లోనైన రాజ్‌కుమార్, "ఎందుకు సార్? నేను హీరో కాకూడదు, నేను వారికి ఎంతకాలం సేవ చేయాలి?" అంటూ వచ్చే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తంగా సినిమాలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో రాష్ట్ర సరిహద్దులను మూసివేసినప్పుడు.. దేశంలో కనిపించిన చీకటి కోణాలను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది.


ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ మొత్తం బ్లాక్ ఆండ్ వైట్ లోనే చూపించారు. ఈ విషయం పై కూడా గతంలో దర్శకుడు అభినవ్ సిన్హా మాట్లాడారు. ఈ సినిమా భారతదేశంలో ఓ చీకటి కాాలానికి సంబంధించిన సినిమా అని అన్నారు. ఇది 1947లో దేశ విభజన జరిగిన సమయం నాటి పరిస్థితులను తలపిస్తుందని చెప్పారు. దేశంలో లాక్ డౌన్ విధించినపుడు వేలాది మంది వలస కార్మికులు తమ కుటుంబాలు రోడ్డున పడినపుడు సరిహద్దుల వద్ద వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో వారి కుటుంబాల భవిష్యత్ అంధకారం అయిందని అన్నారు. అందుకే ఈ సినిమాను అలా బ్లాక్ అండ్ వైట్ లో తీశామని చెప్పారు.