యువ కథానాయకుడు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఓ ఇంటివాడు కాబోతున్నారు. నెలాఖరున ఆయన పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబంలోని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ను కలిసి ఆహ్వానించారు.
చంద్రబాబును కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ!ఏపీ సీఎం చంద్రబాబును శుక్రవారం బెల్లంకొండ కుటుంబం కలిసింది. కాబోయే పెళ్లి కొడుకు సాయి శ్రీనివాస్ సహా ఆయన తల్లిదండ్రులు సురేష్, పద్మ... తమ్ముడు గణేష్ సీఎం దగ్గరకు వెళ్లారు.
ఇటీవల కావ్య రెడ్డితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ నెల 29న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్న శ్రీ తిరుమల తిరుపతి క్షేత్రంలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. తమ ఇంటి వివాహ వేడుకకు చంద్రబాబును ఆహ్వానించారు. మంత్రి నారా లోకేష్ను సైతం కలసి కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు హీరో శ్రీనివాస్.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. పెళ్లికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
