కమర్షియల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'NTR30' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి కాసేపట్లోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 19 సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాలకు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఫిలిం సర్కిల్స్‌లో ఈ సినిమాకి 'దేవర' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ని తాజాగా మూవీ టీమ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఈ 'దేవర' అనే టైటిల్ ని కొన్నాళ్ల క్రితం ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించారు. తాను ఆరాధ్య దైవంగా భావించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'దేవర' అనే టైటిల్ తో ఓ సినిమాను నిర్మించాలనేది ఆయన డ్రీమ్. అంతెందుకు పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ ప్రేమతో దేవర అని పిలుచుకుంటారు.


ఆ టైటిల్ కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సూట్ అవుతుందనేది ఆయన నమ్మకం. అయితే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. కానీ ఆ టైటిల్ ని రెన్యువల్ చేయించడం మర్చిపోయాడు బండ్ల గణేష్. దాంతో 'దేవర' టైటిల్ ని దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా కోసం వాడుకోబోతున్నారు. ఈ దేవర అనే టైటిల్ బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతూనే ఉంది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా బండ్ల గణేష్ బయటపెట్టారు. ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ ఈ టైటిల్ గురించి ఒకింత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ.. "దేవర.. నేను రిజిస్టర్ చేయించుకున్న నా టైటిల్. నేను రెన్యువల్ చేయడం మర్చిపోవడంతో నా టైటిల్ ని కొట్టేశారు" అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దాంతోపాటు ఓ యాంగ్రీ ఈమోజీని సైతం పెట్టాడు. దాంతో ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


కాగా ఈ 'దేవర' అనే టైటిల్ ని పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన వినోదయ సీతం రీమేక్ మూవీకి మొదటగా పెట్టాలని అనుకున్నారు. కానీ తాజాగా ఆ సినిమాకి 'బ్రో' అనే టైటిల్ ని ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమాకి 'దేవర' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తుండగా.. ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సముద్రం నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమాని కొరటాల శివ రూపొందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి విజయం అందుకోవడంతో తాజాగా తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సినిమాని నిర్మిస్తున్నారు.


Also Read: కీర్తి సురేష్‌కు కాబోయే భర్త అతడేనా? వైరల్ అవుతోన్న ఫొటో