గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో కొంత చిత్రీకరణ చేశారు. అయితే, ఆ తర్వాత అనుకున్న రీతిలో షూటింగ్ జరగలేదు.
 
జనవరి నెలాఖరున ప్రారంభంలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని బాలకృష్ణ భావించారు. ఆయన నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభోత్సవానికి వెళ్ళడం, అక్కడ నందమూరి తారకరత్న గుండెపోటుకు గురి రావడంతో షెడ్యూల్ క్యాన్సిల్ చేసి అబ్బాయితో ఉన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి మూడో వారంలో, 23  నుంచి మరోసారి షెడ్యూల్ ప్లాన్ చేశారు. తారకరత్న మరణంతో అదీ క్యాన్సిల్ అయ్యింది.


మార్చి 4 నుంచి ఎన్.బి.కె 108 షూటింగ్
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... మార్చి 4వ తేదీ నుంచి మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేశారట. బాలకృష్ణతో అనిల్ రావిపూడి కొత్త తరహా సినిమా తీస్తున్నారని సమాచారం. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయట. 


ఈ సినిమాలో నందమూరి అందగాడితో తెలుగు తెర చందమామ జోడీ కడుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో బాలకృష్ణది సింగిల్ క్యారెక్టర్ అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినప్పటికీ... డ్యూయల్ షేడ్స్ ఉంటుందని టాక్. అంటే... యంగ్ వెర్షన్ కూడా ఉంటుందట. యంగ్ బాలయ్యకు జోడీగా కాజల్ కనిపించే అవకాశం ఉంది.


బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది. డిసెంబర్ నెలాఖరులో సినిమా కోసం వేసిన భారీ జైలు సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ ఫైట్స్ తీశారు.


Also Read అక్షయ్ కుమార్ పరువు తీసిన 'సెల్ఫీ' - పదేళ్ళలో వరస్ట్ ఓపెనింగ్! 


ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు అమ్మాయి, కథానాయిక అంజలి మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... హ్యాట్రిక్ అన్నమాట. దీని తర్వాత 'అఖండ 2' కూడా చేయనున్నారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఎస్.ఎస్. తమన్ 'అఖండ' సీక్వెల్ అనౌన్స్ చేశారు. 


Also Read వచ్చే వారమే మంచు మనోజ్ రెండో పెళ్ళి - ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?