గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' సినిమాతో విజయం సాధించారు. ఇప్పుడు ఆయన విజయ దశమికి రావడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆయన సినిమాను దసరాకు విడుదల చేయనున్నారట.  


దసరాకు ఎన్.బి.కె 108!?
బాలకృష్ణ కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి వాణిజ్య హంగులతో కూడిన వైవిధ్యమైన కథాంశంతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయిక. బాలయ్యకు జోడీగా కనిపించనున్నారు.  యువ కథానాయిక శ్రీ లీల కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది కూతురు తరహా పాత్ర. ఈ సినిమాను ఈ ఏడాది విజయ దశమికి థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విజయ దశమి బరిలో మరో సినిమా లేదు.  


ప్రస్తుతం హైదరాబాదులో బాలకృష్ణ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికి ఈ షెడ్యూల్ రెండు సార్లు వాయిదా పడింది. లేటెస్టుగా సెట్స్ మీదకు వెళ్ళింది. నిజం చెప్పాలంటే... జనవరి నెలాఖరున ప్రారంభంలో ఈ షెడ్యూల్ ప్రారంభించాలని భావించారు. నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభోత్సవానికి బాలకృష్ణ వెళ్ళడం, అక్కడ నందమూరి తారకరత్న గుండెపోటుకు గురి రావడంతో షెడ్యూల్ క్యాన్సిల్ చేసి అబ్బాయితో ఉన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి మూడో వారంలో, 23  నుంచి మరోసారి షెడ్యూల్ ప్లాన్ చేశారు. తారకరత్న మరణంతో అదీ క్యాన్సిల్ అయ్యింది.


Also Read : తారక రత్నను ఎవరూ అర్థం చేసుకోలేదు - అలేఖ్యా రెడ్డి టార్గెట్ ఎవరు? ఎందుకీ సెన్సేషనల్ కామెంట్స్?


బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది. డిసెంబర్ నెలాఖరులో సినిమా కోసం వేసిన భారీ జైలు సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ ఫైట్స్ తీశారు.


Also Read : 'ఇన్ కార్' రివ్యూ : అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి రేప్ చేయబోతే?


ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తెలుగు అమ్మాయి, కథానాయిక అంజలి మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... హ్యాట్రిక్ అన్నమాట. దీని తర్వాత 'అఖండ 2' కూడా చేయనున్నారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఎస్.ఎస్. తమన్ 'అఖండ' సీక్వెల్ అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత అఖండ సీక్వెల్ ఉంటుందా? లేదంటే మరో సినిమా చేసిన తర్వాత ఉంటుందా? అనేది ఇప్పుడే చెప్పలేం.