Avram Manchu in Kannappa: టాలీవుడ్‌లో ఇప్పటికే వారసులుగా ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టారు. ఇక వారందరిలో మంచు ఫ్యామిలీ సెపరేట్ క్రేజ్ ఉంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా మంచు నటులు ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రెండు తరాల నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఇప్పుడు మూడో తరం నటుడు కూడా వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు. తను మరెవరో కాదు.. విష్ణు కుమారుడు అవ్రామ్ మంచు. తన వారసుడిని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌తోనే ప్రేక్షకులకు పరిచయం చేయాలని డిసైడ్ అయ్యాడు విష్ణు. ఈ విషయాన్ని తన టీమ్ అధికారికంగా ప్రకటించింది.


మరో తరం ముందుకు రానుంది..
ప్రస్తుతం మంచు విష్ణు.. తన తండ్రి మోహన్ బాబు కలిసి ‘కన్నప్ప’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వారి మార్కెట్‌ను మించి సినిమాపై ఖర్చుపెడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్లు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా విష్ణు కుమారుడు అవ్రామ్ కూడా ఈ మూవీలో భాగమవ్వనున్నాడని ‘కన్నప్ప’ టీమ్ బయటపెట్టింది. ‘ఒక తరం రివీల్ అవుతున్న సందర్భంగా చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. కన్నప్ప సినిమాతో అవ్రామ్ మంచు సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. దీని వల్ల మంచు ఫ్యామిలీలోకి మరొక అద్భుతమైన చాప్టర్ చేరనుంది. అంతే కాకుండా ఈ కుటుంబం నుంచి మరో తరం ముందుకు రానుంది’ అంటూ ‘కన్నప్ప’ టీమ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 


త్వరలోనే రెండో షెడ్యూల్..
శివుడికి పరమ భక్తుడైన కన్నప్ప జీవితకథ ఆధారంగా సినిమాను తెరకెక్కించడం తన డ్రీమ్ అని మంచు విష్ణు గత కొన్నాళ్లుగా చెప్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించాడు. సినిమాకు లొకేషన్స్ చూడడం దగ్గర నుంచి అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులను విష్ణునే దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పటికే ‘కన్నప్ప’ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ కూడా విడుదలయ్యింది. దీన్ని బట్టి చూస్తే.. మంచు విష్ణు అనుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు షూటింగ్ జరుపుకొని.. ‘కన్నప్ప’ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో అవ్రామ్ మంచు పాల్గోనున్నాడని సమాచారం.


శివుడిగా ప్రభాస్.. పార్వతిగా నయనతార..
బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనకాడడానికి ఇష్టపడని మంచు విష్ణు, మోహన్ బాబు.. ‘కన్నప్ప’ కోసం బాలీవుడ్, హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లను దింపారు. ‘మహాభారతం’ టీవీ సిరీస్‍తో మంచి పేరు తెచ్చుకున్న హిందీ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్.. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తుండగా.. పార్వతీ పాత్రలో నయనతార నటించనున్నట్టు సమాచారం. ఇక విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. మోహన్ లాల్, శరత్ కుమార్‌లాంటి సీనియర్ నటులను కూడా ‘కన్నప్ప’ క్యాస్ట్‌లోకి చేర్చాడు విష్ణు. సాయిమాధవ్ బుర్రా, పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్‌లాంటి సీనియర్లతో డైలాగులు రాయిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవసి సంయుక్తంగా ‘కన్నప్ప’కు మ్యూజిక్‌ను అందిస్తున్నారు.


Also Read: నా భర్త బోల్డ్ సీన్స్ చేయమని ఎంకరేజ్ చేశారు, అందుకే అలా - ఆనంది